పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును పెంచిన కేంద్రం
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించే గడువును కేంద్రం మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ఈ విధంగా వీటి అనుసంధానానికి గడువును ప్రభుత్వం మూడోసారి పెంచినట్లైంది
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించే గడువును కేంద్రం మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ఈ విధంగా వీటి అనుసంధానానికి గడువును ప్రభుత్వం మూడోసారి పెంచినట్లైంది. కేంద్రం రూపొందించిన ఆధార్ చట్టం, వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానించడం వంటి విషయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇది వరకే కేంద్రం సుప్రీంకోర్టులో తాము వివిధ పథకాలకు, కార్డులకు ఆధార్ అనుసంధానం గడువును మార్చి 31 వరకూ పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
అయితే కొంత మంది పౌరులు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ఇప్పటికీ పూర్తిచేయలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ గడువును మార్చి 31,2018 వరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ నాటికి మొత్తం 33కోట్ల మంది పాన్ కార్డు కలిగిన వారిలో కేవలం 13.28 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని పూర్తిచేశారు.