453 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్
ఈ రోజు మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఈ రోజు మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశ విత్త లోటుకు సంబంధించి ప్రమాదకర గణాంకాలు వెలువడటంతో మార్కెట్ల మీద ఎక్కువ ప్రభావం పడింది. దేశ విత్త లోటుకు సంబంధించి మొత్తం ఏడాదికి నిర్ణయించుకున్న లక్ష్యానికి సంబంధించి ఏప్రిల్- అక్టోబర్ నెలల నాటికే ప్రభుత్వం 96% విత్త లోటు దశకు చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ పెట్టుబడులలోంచి తమ డబ్బును వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించారు. అంతే కాకుండా రాయిటర్స్ నిర్వహించిన పోల్లో 52 మంది ఆర్థిక వేత్తలు పాల్గొనగగా దేశ జీడీపీ ఇంతకు ముందు ఉన్న స్థాయి నుంచి 6.4 శాతానికి చేరుకోగలదని చెప్పడం సైతం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. అంతే కాకుండా సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడనుండటంతో మదుపర్లు ఆచితూచి స్పందించారు. ఇవన్నీ కారణాలతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 453(1.35%) పాయింట్లు కోల్పోయి 33,149 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 134.75 పాయింట్లు(1.30%) దిగజారి 10.226.55 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో అన్ని రంగాలు నష్టాల్లోనే పయనించాయి. నిఫ్టీ సూచీలో సైతం ఒక్క స్థిరాస్తి రంగం తప్ప అన్ని రంగాలు నష్టపోయాయి. స్థిరాస్తి రంగం(1.12%) సానుకూలంగా కదలగా నిఫ్టీ బ్యాంక్(1.80%), నిఫ్టీ ఆటో(1.18%), ఎఫ్ఎంసీజీ(0.59%), మీడియా(0.84%), లోహ రంగం(1.17%) నష్టపోయాయి.
ఈ రోజు బీఎస్ఈ సూచీలో నష్టపోయిన వాటిలో కొటక్ బ్యాంక్(2.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(2.54%), రిలయన్స్(2.42%), యాక్సిస్ బ్యాంక్(2.39%), టాటా మోటార్స్(2.32%) ముందున్నాయి. కేవలం రెండు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్(0.45%), ఎన్టీపీసీ(0.36%) బలపడ్డాయి.