ఎన్ఆర్ఐలకు ఆధార్ అనుసంధానం అక్కర్లేదు
ఎన్ఆర్ఐలు, పీఐవో(పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్)లు, ఓసీఐలు.. బ్యాంక్ ఖాతాలు, పాన్ సహా ఇతర వాటితో ఆధార్ను అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆధార్ బోర్డు (యూఐడీఏఐ) స్పష్టం చేసింది.
ఎన్ఆర్ఐలు, పీఐవో(పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్)లు, ఓసీఐలు.. బ్యాంక్ ఖాతాలు, పాన్ సహా ఇతర వాటితో ఆధార్ను అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆధార్ బోర్డు (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2017, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బ్యాంక్ ఖాతాలను, పాన్ను తప్పక అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని, అయితే ఈ నిబంధన ఆధార్ నమోదుకు అర్హత కలిగి ఉన్న వారికే వర్తిస్తుందని పేర్కొంది. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐఓలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐలు), నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐలు) ఆధార్ అంశమై పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. వీరు ఏమైనా సేవలు, ప్రయోజనాలు పొందాలని భావిస్తే.. ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు ఆధార్ అడుగుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. వీరికి అసలు ఆధార్ నెంబర్ ఉండదనే విషయాన్ని గుర్తించాలని తెలిపింది.
అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పథకాలను అమలు చేసే ఏజెన్సీలు ఆధార్ చట్టం ప్రకారం ఆధార్ అర్హత ఉన్నవారిని గుర్తించి అందుకు తగ్గట్లుగా ముందుకు సాగాలని ఆధార్ నియంత్రణ (యూఐడీఏఐ)సంస్థ సూచించింది. కొన్ని శాఖలు ఎన్ఆర్ఐలు, పీఐవో(పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్)లు, ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా)లను సైతం ఆధార్ లింక్ చేయాల్సిందిగా అడుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా యూఐడీఏఐ ప్రస్తావించింది.