3 రోజుల నష్టాల నుంచి కోలుకొని పైకి
సెన్సెక్స్ 33వేల మార్కును దాటింది. ఆసియా మార్కెట్ల సానుకూల సెంటిమెంటుతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకూ ఆశాజనకంగానే సాగాయి.
బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 33వేల మార్కును దాటింది. ఆసియా మార్కెట్ల సానుకూల సెంటిమెంటుతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకూ ఆశాజనకంగానే సాగాయి. డాలర్ బలపడటంతో ఐటీ, ఫార్మా రంగ షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 1.06% లాభపడి 33,106 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 0.96% పైకి ఎగసి 10,214 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 346 పాయింట్ల వరకూ బలపడింది.మరో వైపు నిఫ్టీ కూడా 96.70 పాయింట్లు లాభంతో 10,214.75 వద్ద స్థిరపడింది. రూపాయితో మారకం విలువ 65.22 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం అన్నింటి కంటే అత్యధికంగా 2.36శాతం లాభపడింది. ఇంకా టెలికాం, స్థిరాస్తి, విద్యుత్, వినియోగదారు వస్తువులు సహా అన్ని రంగాలు లాభాల్లో సాగాయి.
బీఎస్ఈ సూచీలో ఇన్ఫోసిస్ షేర్ 3.85% పుంజుకుని రూ.988.60 వద్ద ముగిసింది. ఎస్బీఐ(2.54%), రిలయన్స్(2.27%), ఎన్టీపీసీ(1.58%), టీసీఎస్(1.49%) బాగా లాభపడిన వాటిలో ఉన్నాయి. సుజ్లాన్ ఎనర్జీ షేర్లు ఏడాది కనిష్టం నమోదయి 6.2% మేర నష్టాలకు గురయ్యాయి. కార్మికులతో వివాదం కారణంగా కర్ణాటక ప్లాంట్ను సస్పెండ్ చేస్తూ లాకౌట్ ప్రకటించడంతో ఈ కంపెనీ షేర్ బాగా నష్టపోయింది.