గత రెండేళ్లలో భారత్లోకి భారీగా విదేశీ నిధుల రాక
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలలో కలిపి 114.4 బిలియన్ డాలర్ల మేరకు ఎఫ్డిఐలు భారత్కు చేరాయని అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ తన తాజా నివేదికలో వెల్లడించింది
గత రెండు ఆర్థిక సంవత్సరాలలో భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) ఈక్విటీల రూపంలో భారీగా చేరుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలలో కలిపి 114.4 బిలియన్ డాలర్ల మేరకు ఎఫ్డిఐలు భారత్కు చేరాయని అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతకుముందు మూడు సంవత్సరాలలో భారత్కు చేరిన ఎఫ్డిఐల మొత్తంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువని పేర్కొంది. 2011-12 నుంచి 2013-14 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలలో కలిపి 81.8 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు భారత్కు చేరాయని ఆ నివేదిక పేర్కొంది. ఒక్క 2017 అక్టోబర్ నెలలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) పెట్టుబడిదారులు భారత్లో 2.5 బిలియన్ డాలర్ల విలువ గల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారని వెల్లడించింది. ఇందులో ఒక బిలియన్ డాలర్లు అబుదాబి ఇనె్వస్ట్మెంట్ అథారిటి (ఎడిఎఐ), ఒక బిలియన్ డాలర్లు ఎన్ఆర్ఐ-ఎమిరటి ఇన్వెస్టర్స్ గ్రూప్, 462 మిలియన్ డాలర్లు ఆంధ్రప్రదేశ్లో లులు గ్రూప్ పెట్టుబడులుగా పెడుతున్నట్టు వివరించింది. గత వారం ఇక్కడ జరిగిన తొలి భారత్-యుఎఇ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో ఈ నివేదికను తయారు చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలిసి అండ్ ప్రమోషన్ (డిఐపిపి) గణాంకాల ప్రకారం, 2000 ఏప్రిల్ నుంచి 2017 జూన్ వరకు 17 సంవత్సరాలలో కలిపి మొత్తం 498.9 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు భారత్కు చేరాయి.
2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యధికంగా 43.5 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐలను స్వీకరించిందని కెపిఎంజి పేర్కొంది. బిజినెస్ లీడర్స్ ఫోరం (బిఎల్ఎఫ్) నిర్వహించిన ఐయూపీఎస్(ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సు)లో ఈ నివేదికను విడుదల చేశారు.