ఎస్బీఐ ఖాతా మూసివేతకు చార్జీల ఎత్తివేత
అక్టోబరు 1 నుంచి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. అయితే ఏడాది పూర్తయిన సాధారణ పొదుపు ఖాతా, ప్రాథమిక పొదుపు ఖాతాలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని వర్తింప చేయనున్నట్లు నిబంధన పెట్టింది.
ఎస్బీఐ సంబంధించి వివిధ నిబంధనలతో విసిగిపోయిన వారికి ఒక శుభవార్త అందించింది. ఖాతా తెరిచి కనీసం ఏడాది గడిచిన వాటి విషయంలో ఇకపై ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐలో ఖాతా రద్దు చేయాలంటే ఇప్పటి వరకూ జీఎస్టీతో కలిసి రూ.500లు వసూలు చేసేవారు. అక్టోబరు 1 నుంచి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. అయితే ఏడాది పూర్తయిన సాధారణ పొదుపు ఖాతా, ప్రాథమిక పొదుపు ఖాతాలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని వర్తింప చేయనున్నట్లు నిబంధన పెట్టింది. గతంలో ఎస్బీఐ ఖాతా రద్దు చేయాలంటే బ్యాలెన్స్లో రూ.500లు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఖాతాదారుడికి ఇచ్చేవారు.

'ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస మొత్తాన్ని నిర్వహించాలని ఎస్బీఐ ఇటీవల నిబంధన తీసుకొచ్చింది. అయితే చాలామంది ఖాతాదారులు ఆ నిబంధనను పాటించడం లేదు. దీంతో వారికి జరిమానా విధిస్తున్నాం. అందువల్ల చాలామంది తమ ఖాతాలను రద్దు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాంటి వారికి ఇబ్బంది కలగకూడదనే ఛార్జీలను తొలగిస్తున్నాం' అని ఎస్బీఐ అధికారులు తెలిపారు.
పొదుపు ఖాతాల్లో నిర్వహించే కనీస మొత్తాన్ని ఎస్బీఐ ఇటీవల తగ్గించిన సంగతి తెలిసిందే. మెట్రో నగరాల్లో నిర్వహణ మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.3వేలకు కుదించింది. తగిన మొతాన్ని ఖాతాల్లో ఉంచని వారిపై మెట్రో నగరాల్లో రూ.30 నుంచి 50కి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 నుంచి 40కి అపరాధ రుసుంను పెంచింది.


Click it and Unblock the Notifications