ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీలను తగ్గించిన ట్రాయ్, తగ్గనున్న కాల్ రేట్లు
ట్రాయ్ ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జెస్(ఐయూసీ)ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల టెలికా సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
ట్రాయ్ ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జెస్కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక ఆపరేటర్ నుంచి ఇంకో ఆపరేటర్కు వెళ్లే కాల్స్కు మొదటి ఆపరేటర్ చెల్లించే చార్జీలను ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జెస్(ఐయూసీ) అంటారు. ఈ చార్జీలను నిమిషానికి ఇంతకుముందున్న 14 పైసలు నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పలు ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
అక్టోబర్ 1 నుంచి కొత్త చార్జీల అమలు
ట్రాయ్ సరికొత్త నిర్ణయంతో కొత్తగా టెలికాం రంగంలో ప్రవేశించిన రిలయన్స్ లాభపడనుండగా, ఇప్పటి టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ నష్టపోనుంది. కొత్త చార్జీలు అక్టోబరు 1 నుంచే అమల్లోకి వస్తాయని ట్రాయ్ ప్రకటించింది. అదే విధంగా జనవరి 2020 నుంచి ఈ తరహా చార్జీలను లేకుండా చేస్తామని తెలిపింది. ఇంకా ల్యాండ్ లైన్ నుంచి మొబైల్, ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్ కాల్స్కు సంబంధించి ఇదివరకే ఉన్నా సున్నా ఐయూసీ కొనసాగుతుందని ట్రాయ్ చెప్పింది.
ఒకరికి మోదం... మరొకరికి ఖేదం...
ఐయూసీని 6 పైసలకు తగ్గించడం మూలంగా ఏటా రిలయన్స్ జియోకు రూ.4000 కోట్ల ఆదా అవుతుందని టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో ఎయిర్టెల్ ఏటా రూ.1500-2000 కోట్ల వరకూ నష్టపోతుందని, అదే వోడాఫోన్ రూ.1500 కోట్లు, ఐడియా సెల్యూలార్ రూ.1200 కోట్ల వరకూ నష్టపోతాయని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ కచ్చితమైన లెక్కలని చెప్పలేం. ఊహాగానాలు మాత్రమే.
అప్పట్లో 35 పైసలకు పెంచాలన్ని ప్రధాన టెలికాం సంస్థలు
ట్రాయ్ దీనిపై చర్చాపత్రం విడుదల చేసి సంప్రదింపులు జరిపినప్పుడు టెలికాం దిగ్గజాలు ఈ తరహా చార్జీలను ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి 35 పైసలకు పెంచాలని కోరాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం పూర్తిగా చార్జీలను తొలగించాల్సిందిగా కోరింది. దీనిపై ఇదివరకే టెలికాం రంగంలో నిలదొక్కుకున్న సంస్థలు, ఏడాది క్రితం ప్రవేశించిన జియో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
భిన్నాభిప్రాయాలు
ఎయిర్టెల్ అయితే ఐయూసీని తక్కువగా నిర్ణయించడం వల్ల గత ఐదేళ్ల కాలంలో రూ.6800 కోట్ల మేర నష్టపోయినట్లు ఇటీవల వెలువరించిన గణాంకాల్లో స్పష్టం చేసింది. మరో వైపు వోడాఫోన్ సీఈవో విట్టోరియా కొలావో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ చార్జీని తగ్గించవద్దని కోరారు. చార్జీ తగ్గిస్తే అది నెట్వర్క్ కవరేజీపై పడుతుందని, భారీ సంఖ్యలో లాభదాయకంగా లేని మొబైల్ సైట్లు మూతపడతాయని పేర్కొన్నారు. మరో వైపు జియో, ఇతర చిన్న ఆపరేటర్లు మాత్రం ఐయూసీని పూర్తిగా తీసేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. చార్జీలు తొలగించాలనే వారి వాదన ప్రకారం అంతిమంగా వినియోగదారులు లాభపడతారు. టెలికాం ఆపరేటర్లు ఐయూసీ ద్వారా రూ.లక్ష కోట్ల మేర లాభాల్ని గడించాయని జియో ఆరోపిస్తోంది.
సీవోఏఐ స్పందన ఇలా...
సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత, దేశీయంగా టర్మినేషన్ చార్జీలు(ఐయూసీ) తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై టెలికాం రంగంలోని ప్రధాన సంఘం సెల్యూలార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) స్పందిస్తూ "ట్రాయ్ నిర్ణయం సహేతుకంగా లేదని దాని వల్ల తమకు నష్టాలు వస్తాయని, దానిపై కోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఆర్థికంగా టెలికాం సంస్థలు ప్రభావితమవుతాయి. చాలా మంది దీని పరిష్కారానికి కోర్టుకు వెళతారు." అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రంజన్ మాథ్యూస్ చెప్పారు.