కనీస నిల్వ లేకపోతే చార్జీలు-దీన్ని సమీక్షిస్తాం...
బ్యాంకు పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలను కొనసాగించనందుకు విధించే చార్జీలను సమీక్షిస్తున్నట్లు దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసింది.
బ్యాంకు పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలను కొనసాగించనందుకు విధించే చార్జీలను సమీక్షిస్తున్నట్లు దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఎస్బీఐ తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో కనీస నగదు నిల్వలను కొనసాగించక పోవడంపై చార్జీలను విధించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తమ వినియోగదార్ల నుంచి సలహాలు, సూచనలు అందాయని, వాటన్నింటినీ సమీక్షిస్తున్నామని, వాటిని పరిగణనలోకి తీసుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సీనియర్ సిటిజన్స్ (వయో వృద్ధులు), విద్యార్థులు లాంటి కొన్ని కేటగిరీలకు చార్జీల్లో ఏదైనా మార్పు చేయాల్సిన అవసరం ఉందా అనే అంశంపై తాము అంతర్గతంగా చర్చ జరుపుతామని, ఈ చార్జీలు మార్పులకు వీలు లేనివేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎస్బీఐ సవరించిన చార్జీల జాబితా ప్రకారం ఖాతాల్లో కనీస నగదు నిల్వలను కొనసాగించని పక్షంలో రూ. 100 పెనాల్టీతో పాటుగా జీఎస్టీని విధిస్తారు. నగరాల్లో ఖాతాల్లో నిల్వ మొత్తం రూ. 5 వేలలో 75 శాతం కంటే తక్కువకు పడిపోతే 100 రూపాయలతో పాటుగా జిఎస్టి వసూలు చేస్తారు. అదే 50 శాతం అంతకన్నా తక్కువ తగ్గితే రూ. 50, జిఎస్టి కలిపి వసూలు చేస్తారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కనీసనగదు నిల్వ రూ 1000గా ఉండాలి. ఒక వేళ అంత మొత్తాన్ని కొనసాగించలేకపోయిన పక్షంలో 20నుంచి 50 రూపాయల వరకు పెనాల్టీతో పాటు జిఎస్టి వసూలు చేస్తారు. బ్యాంకులో 40 కోట్లకు పైగా సేవింగ్స్ ఖాతాలున్నాయని, వీటిలో 13 కోట్లు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన్ ఖాతాలు ఉన్నాయని కుమార్ చెప్పారు. ఈ రెండు రకాల ఖాతాలను బ్యాంక్ కనీస నగదు నిల్వ నిబంధననుంచి మినహాయించింది. మిగతా 27 కోట్ల మామూలు సేవింగ్స్ ఖాతాల్లో 15-20 శాతం దాకా ఖాతాలు కనీస నగదు నిల్వలను కొనసాగించనివిగా ఉన్నాయి.