జులై నెలలో దిగజారిన పారిశ్రామికోత్పత్తి
పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏడాది జూలై నెలలో 1.2 శాతానికి పడిపోయింది. నిరుడు జూలైలో 4.5 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్ఒ) మంగళవారం వివరాలను విడుదల చేసింది.
పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏడాది జూలై నెలలో 1.2 శాతానికి పడిపోయింది. నిరుడు జూలైలో 4.5 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్ఒ) మంగళవారం వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఐపి వృద్ధిరేటు 0.2 శాతంగా ఉండగా, దానితో పోల్చితే జూలైలో వృద్ధిరేటు పెరిగింది. అయితే నిరుడు జూలైతో పోల్చితే మాత్రం భారీగా పతనమైంది. కీలకమైన ఉత్పాదక రంగంలో వృద్ధిరేటు దారుణంగా దిగజారిపోవడమే ఇందు కు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఐఐపిలో తయారీ రంగం వాటా 77.6 శాతం. అలాంటి ఈ రంగం ఈ జూలై నెలలో కేవలం 0.1 శాతం వృద్ధికే పరిమితమైంది. నిరుడు జూలైలో 5.3 శాతం వృద్ధిరేటును అందుకుంది. మూలధన వస్తువులు, వినియోగదారు వస్తు ఉత్పత్తి మరీ క్షీణించింది. అయితే విద్యుదుత్పత్తి, మైనింగ్ కార్యకలాపాలు మాత్రం పుంజుకున్నాయి. నిరుడు జూలైతో చూస్తే విద్యుదుత్పత్తి 2.1 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగితే, మైనింగ్ కార్యకలాపాలు 0.9 శాతం నుంచి 4.8 శాతానికి చేరాయి. ఇకపోతే ఈ ఏప్రిల్-జూలైలో ఐఐపి వృద్ధిరేటు 1.7 శాతంగా నమోదైనట్లు సిఎస్ఒ తెలిపింది. నిరుడు ఏప్రిల్- జూలైలో 6.5 శాతంగా ఉంది. తాజా గణాంకాల నేపథ్యంలో వడ్డీరేట్లను మరింతగా తగ్గించాలనే ఒత్తిడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)పై పడుతోంది. పారిశ్రామిక, వ్యాపార సంఘాలు కీలక వడ్డీరేట్లను ఆర్బిఐ తగ్గించాలని కోరుతున్నాయి.