మొండి బకాయిలు: బ్యాంకులకు 26 కంపెనీల జాబితా పంపిన ఆర్బీఐ
ఇప్పుడు బ్యాంకులకు పంపిన రెండో విడత జాబితాలో 26 సంస్థలున్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట పథకాల ద్వారా ఈ సంస్థల నుంచి పాత అప్పులను రాబట్టేందుకు డిసెంబరు 13 దాకా రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది
దశాబ్దాల పాటు మొండి బకాయిలపై నిర్మాణాత్మక చర్యలను చేపట్టకుండా 2017లో ఏదో కొంత పని జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మొండి బకాయిల విషయంలో కేంద్రం ఐబీసీ(ఇన్సాల్వెన్సీ) చట్టం ఆర్బీఐ, బ్యాంకులకు మరిన్ని సుస్పష్టమైన అధికారాలు ఇవ్వడం, వసూలు కాని రుణాలకు సంబంధించిన సొంతదారుల ఆస్తుల వేలానికి అవకాశాలు ఉండటంతో ఆర్బీఐ చురుగ్గా కదులుతోంది. ఇది వరకే మొదటి జాబితా ప్రకటించిన కేంద్ర బ్యాంకు ఇప్పుడు బ్యాంకులకు పంపిన రెండో విడత జాబితాలో 26 సంస్థలున్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట పథకాల ద్వారా ఈ సంస్థల నుంచి పాత అప్పులను రాబట్టేందుకు డిసెంబరు 13 దాకా రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది. ఏ సంస్థలైతే రుణం కట్టకుండా ఎగవేస్తాయో వాటిపై బ్యాంకింగ్ చట్టాలు, దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడకూడదని బ్యాంకులకు పంపిన లేఖలో, జాబితాలో ఆర్బీఐ స్పష్టపరిచిందని మింట్ పేర్కొంది.
మొత్తం 26 కంపెనీల్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్, జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) ప్రముఖంగా ఉన్నాయి. కేవలం ఈ రెండు సంస్థలే 1 ట్రిలియన్ రూపాయలు బకాయి పడ్డట్లు ఆర్బీఐ నివేదిక ప్రస్తావించింది. తమ రుణ చెల్లింపు ప్రణాళికను రుణదాతల ఫోరం జూన్ 22న ఆమోదించిన నేపథ్యంలో తాజా జాబితాపై తాము ఇప్పుడు స్పందించట్లేదని జీపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. ఆర్బీఐ లేఖలో పేర్కొన్న విధంగా వస్తున్న వివరాలు నిజమే అయితే దివాలా చట్టం ప్రయోగించే దాకా వెళ్లకుండానే పరిష్కారం కనుగొనేలా ఇటు రుణ దాతలను, అటు రుణ గ్రహీతలను పద్దతి ప్రకారం ప్రోత్సహించవచ్చని కొందరు ఈ రంగంలోని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ మొండి బకాయిలపై మార్గ సూచీ విధించుకున్న విధంగా 500 భారీ నిరర్దక ఆస్తుల సమస్య పరిష్కారానికి ఆరు నెలల్లోగా తగిన ప్రణాళిక రూపొందించాలంటూ బ్యాంకులను సైతం ఆదేశించింది. ఒకవేళ నిర్దిష్టమైన పరిష్కారం దొరకని సందర్భంలో దివాలా చట్టం కింద చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీని ఆశ్రయించొచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తుల పరిమాణం 24 శాతం వృద్దితో రూ. 7.79 లక్షల కోట్లకు చేరింది. వీటికి సంబంధించి తొలి విడతలో భారీగా బాకీపడిన 12 ఖాతాలను ఆర్బీఐ గుర్తించి.. తక్షణ చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశించింది. ప్రస్తుతం స్థూల నిరర్దక ఆస్తుల చర్యలు వాస్తవ రూపు దాల్చే నేపథ్యంలో ఆర్బీఐ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా కనిపిస్తోంది. మొత్తం 20 బ్యాంకుల్లో 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు,2 ప్రయివేటు బ్యాంకులు ఉన్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ రెండు ప్రైవేటు బ్యాంకులు మొత్తం స్థూల నిరర్దక ఆస్తుల్లో 7.9% వాటా కలిగి ఉన్నాయి.