83,850 కోట్ల ఒప్పందం: ఎస్సార్ ఆయిల్ ఇక విదేశీ కంపెనీల పరం
రష్యాకు చెందిన అతి పెద్ద ఆయిల్ కంపెనీ రాస్నెఫ్ట్ ఈ ప్రాజెక్టు ఈక్విటీలో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. మరో 49 శాతం వాటాను రష్యాకే చెందిన ఇన్వె్స్టమెంట్ ఫండ్ ‘యునైటెడ్ క్యాపిటల్ పార్టనర్స్Ucp
*ఈ ఒప్పందంతో రూ.70 వేల కోట్ల అప్పు తీరేనా?
దేశంలోని అతిపెద్ద పెట్రో రిఫైనరీ ప్రాజెక్టుల్లో ఒకటైన ఎస్సార్ ఆయిల్ కంపెనీ యాజమాన్యం చేతులు మారింది. మొత్తం ఎస్సార్ ఆయిల్ కంపెనీ విదేశీ కంపెనీల పరం కానుంది. అయితే దీని ద్వారా ఎస్సార్ ఆయిల్కు ఉన్న అప్పులు తీరడం ఒక పరిణామం కాగా, దేశ చమురు రంగంలో రాస్నెఫ్ట్ తనదైన కీలక పాత్రను పోషించనుంది. దాదాపు 3.5 బిలియన్ అమెరికా డాలర్లు ఈ డీల్ తర్వాత మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం గురించి ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
రూ.70 వేల కోట్ల ఎస్సార్ గ్రూప్ అప్పులు
రష్యాకు చెందిన అతి పెద్ద ఆయిల్ కంపెనీ రాస్నెఫ్ట్ ఈ ప్రాజెక్టు ఈక్విటీలో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. మరో 49 శాతం వాటాను రష్యాకే చెందిన ఇన్వె్స్టమెంట్ ఫండ్ ‘యునైటెడ్ క్యాపిటల్ పార్టనర్స్(-యూసీపీ)', నెదర్లాండ్కు చెందిన ట్రాఫిగురా అనే కమోడిటీస్ కంపెనీలు చెరిసగం కొనుగోలు చేస్తాయి. ఈ మూడు కంపెనీలు ఇందుకోసం ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లకు 1,290 కోట్ల డాలర్లు (సుమారు రూ.83,850 కోట్లు) చెల్లిస్తాయి. ఈ డీల్తో ఎస్సార్ గ్రూప్ అప్పుల భారం సగానికి తగ్గుతుందని అంచనా. ఎస్సార్ గ్రూప్కు ఉన్న మొత్తం రూ.70 వేల కోట్ల అప్పు ఈసారి తీరిపోతుందని ప్రశాంత్ రుయా సోమవారం చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా రష్యా.. భారత్లో అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డిఐ) పెడుతోంది. ఒక రష్యా కంపెనీ విదేశాల్లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కూడా ఇదే మొదటిసారి.
ఎస్సార్ గ్రూప్ ఎదిగిన క్రమం
సరళీకృత ఆర్థిక విధానాలతో 1995లో ఎస్సార్ గ్రూప్ గుజరాత్లోని వడినార్ దగ్గర ఈ రిఫైనరీ ఏర్పాటు చేసింది. మొదట్లో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఆ తర్వాత రెండు కోట్ల టన్నులకు విస్తరించారు. ఆ తర్వాత ఈ రిఫైనరీ ద్వారా ఎస్సార్ గ్రూప్ పెట్రో ఉత్పత్తుల రిటైల్ అమ్మకాల రంగంలోకీ విస్తరించింది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 3,500 పెట్రోల్ బంకులు ఉన్నా యి. ఇంకా ఈ రిఫైనరీ నిర్వహణ కోసం వడినార్ సమీపంలోనే ఎస్సార్ గ్రూప్ 1,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, ప్రత్యేకంగా ఓడ రేవును ఏర్పాటు చేసింది. ఇపుడు ఇవన్నీ రిఫైనరీతో పాటు రాస్నెఫ్ట్ పరం కానున్నాయి.
డీల్ జరిగిన క్రమం
వాస్తవానికి గత ఏడాది గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలోనే ఎస్సార్-రోస్నెఫ్ట్ మధ్య ఈ డీల్ కుదిరింది. అయితే వడినార్ పోర్టుకు సమీపంలోనే కొన్ని రక్షణ స్థావరాలు ఉండడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎస్సార్ గ్రూప్లోని ఇతర కంపెనీలకు అప్పులిచ్చిన ఎల్ఐసి, బ్యాంకులు ఆ బకాయులు కూడా ఈ అమ్మకం నిధులతో తీరిస్తేనే డీల్కు ఆమోదం తెలుపుతామని ప్రకటించడం కూడా డీల్ను ఆలస్యం చేసింది. ఇపుడు ఈ వివాదాలన్నీ సమసిపోవడంతో ఒప్పందం ఖారారైంది.
రాస్నెఫ్ట్కేంటి లాభం?
రష్యా ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న రాస్నెఫ్ట్ కంపెనీకి రష్యాలో పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐరోపా దేశాలు ఈ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునేవి. ఉక్రెయిన్ సంక్షోభంతో ఈ దిగుమతులు తగ్గించేయడంతో రాస్నెఫ్ట్ చైనా, భారత్పై దృష్టి పెట్టింది. 2015 నుంచి ఎస్సార్ ఆయిల్ రిఫైనరీకి పెద్ద ఎత్తున ముడి చమురు సరఫరా చేస్తోంది. ఇపుడు ఈ కొనుగోలుతో తన ముడి చమురుకు ప్రధాన మార్కెట్తో పాటు భారత పెట్రో ఉత్పత్తుల రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీలకు రిటైల్ మార్కెట్లో మరింత పోటీ ఎదురవనుంది.
కొత్త ఛైర్మన్గా టోనీ ఫౌంటెన్
సంస్థ మొత్తం రోస్నెఫ్ట్ చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఎస్సార్ ఆయిల్ సీఈవో లలిత్ కే గుప్తా రాజీనామా చేశారు. అయితే, సంస్థ కొత్త మేనేజ్మెంట్కు సీనియర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్న రోస్నెఫ్ట్ దాని భాగస్వాములు ఎస్సార్ ఆయిల్ కంపీనీ బోర్డును వారికి కావాల్సిన విధంగా మార్చుకోనున్నారు. ట్రాఫిగురా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 2012 నుంచి సీఎఫ్వోగా పనిచేసిన బీ ఆనంద్.. సంస్థకు కొత్త సీఈవోగా నియమితులయ్యారు. యూసీపీ ఆయన్ను ప్రతిపాదించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాజీ ఎగ్జిక్యూటివ్ టోనీ ఫౌంటెన్ ఇకపై ఎస్సార్ ఆయిల్ కొత్త ఛైర్మన్. మొత్తం 12 మందితో కూడిన ఎస్సార్ ఆయిల్ బోర్డులో రోస్నెఫ్ట్ తరఫున నలుగురు సభ్యులు ఉంటారు. యూసీపీ తరఫును టోనీ ఫౌంటెన్తో పాటు మరో వ్యక్తి బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ట్రాఫిగురా తరఫున ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రమోటర్ల కుటుంబం నుంచి ఇన్నాళ్లూ ఎస్సార్ ఆయిల్లో డైరెక్టరుగా కొనసాగిన ప్రశాంత్ రుయా సైతం బోర్డు నుంచి తప్పుకోనున్నారు.
ఎస్సార్ గ్రూప్ గురించి
శశి రుయా, రవి రుయా స్థాపించిన దేశంలోనే రెండో అతిపెద్ద చమురు కంపెనీ
ప్రారంభమైన సంవత్సరం: 1969
ప్రధాన కార్యాలయం:ముంబయి
ముఖ్య ఉత్పత్తులు: ఉక్కు, చమురు,సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ, మౌలిక రంగం, షిప్పింగ్, ఐటీ,
రిటైల్, స్థిరాస్తి
రాస్నెఫ్ట్
రష్యా ప్రభుత్వానికి ఎక్కువ వాటా ఉన్న చమురు,సహజ వాయు సంస్థ ఇది.
మార్చి 2013 తర్వాత నుంచి పబ్లిక్ ట్రేడెడ్ ఆయిల్ కంపెనీగా మారింది(టీఎన్కే-బీపీ కొనుగోలుతో)
స్థాపించిన సంవత్సరం: 1993
ప్రధాన కార్యాలయం: మాస్కో, రష్యా
ఉత్పత్తులు: పెట్రోలియం, సహజ వాయువు, మోటారు ఇంధనాలు, పెట్రో కెమికల్స్