త్రైమాసిక ఫలితాల్లో ఏకీకృత నికర లాభాలు పెరిగాయ్
మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో, 2017-18 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు లాభాలు 20.45 శాతం క్షీణించాయి.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏకీకృత నికర లాభాలు పెరిగాయ్. అయితే మొత్తంగా లాభాలు మాత్రం తగ్గాయ్. మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో, 2017-18 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు లాభాలు 20.45 శాతం క్షీణించాయి. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో బ్యాంకు లాభాలు రూ.2,006 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 2,520.96 కోట్లుగా ఉన్నాయి. బ్లూమ్బర్గ్ అంచనాల ప్రకారం బ్యాంకు రూ.2,955.90 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని అనుకున్నారు. కానీ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు గత త్రైమాసికం నుంచి ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయి. గత త్రైమాసికంలో 6.9 శాతమున్న స్థూల నికర మొండి బకాయిలు ఈ త్రైమాసికంలో 9.97 శాతానికి పెరిగాయి.
నికర ఎన్పీఏలు కూడా జూన్ క్వార్టర్లో 5.97 శాతానికి ఎగిశాయి. గత త్రైమాసికంలో ఇవి కూడా 3.71 శాతంగానే ఉన్నాయి. అంతేకాక ఇతర కేటాయింపులు, కంటింజెన్సీస్ 53.1 శాతం పెరిగి రూ.21,054.74 కోట్లగా ఉన్నాయి. రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకు ఆర్జించిన కోర్ ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ)లు 22 శాతం పెరిగి రూ.17,606.01 కోట్లగా రికార్డయ్యాయి. ఇవి గతేడాది రూ.14,437.31 కోట్లుగానే ఉన్నాయి. ఇతర ఆదాయాలు 11.03 శాతం ఎగిసి రూ.8,005.66 కోట్లగా బ్యాంకు ప్రకటించింది. ఫలితాల ప్రకటనలో బ్యాంకు లాభాలు 20 శాతం మేర పడిపోవడం, మొండిబకాయిలు ఎగియడంతో బ్యాంకు షేరు 5.02 శాతం క్షీణించి రూ.281.80గా నమోదవుతోంది. ఏకీకృత నికర లాభాలు క్రితం ఏడాది క్యూ1లో 867.32 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది క్యూ1లో 3105 కోట్లకు పెరిగాయి.