బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వం ఏం చేసింది?
జనాలనుఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు కదులుతోంది.ఈ క్రమంలోనే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన”
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి అట్టడుగు వర్గాల వారికి చేరడం లేదు. ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం లక్షించినప్పటికీ పేదల ఆర్థిక స్థితి మెరుగుపడటం లేదు. పేదలకు ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యాన్ని చెప్పి, ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన "ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన" ప్రతి భారతీయుడిని దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గత భాగస్వామి ని చేసింది. దేశ చరిత్రలో ఇలాంటి పథకం ఆచరణలోకి రావడం ఇదే ప్రథమం. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా
2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దిన సందర్భంగా మోదీ జాతినుద్దేశిస్తూ ప్రసంగించిన సమయంలో ఈ పథకం గురించి ఆలోచనలను దేశ ప్రజలందరితో పంచుకున్నారు. అయితే మొదట్లో ఒక్కో కుటుంబానికి ఒక్కో ఖాతా చొప్పున తెరవాలనుకున్న లక్ష్యం కాస్త ప్రస్తుతం దాదాపు దేశ ప్రజలందరి కుటుంబాల్లో ప్రతి ఒక్క యుక్త వయసు గలవారికి బ్యాంకు ఖాతా తెరిచే విధంగా కార్యక్రమం మారింది.
ఈ పథకం ద్వారా ఏం చేశారు?
కాలక్రమంలో ప్రభుత్వ పథకాలన్నింటినీ ఈ బ్యాంకు ఖాతాకు అనుసంథానం చేస్తూ వస్తున్నారు. పెన్షన్, ఇతర రాయితీలు ఇందులోనే జమ చేస్తారు. వీరికిచ్చే రూపే కార్డు సాధారణ డిబెట్ కార్డుల్లాగే ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు అదనంగా 5వేల రూపాయల వరకూ ఒవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. ఒకవేళ ఖాతాదారుడు డిఫాల్టర్గా మారితే కేంద్రం కార్పస్ ఫండ్ నుండి బ్యాంకుకు బకాయిలు చెల్లిస్తుంది. రూపే కార్డు దారులకు రూ.30 వేల వరకూ జీవిత బీమా, రూ.1 లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా ప్రతి జన్ధన్ ఖాతా కలిగిన వ్యక్తికీ ఎటువంటి ప్రత్యేక రుసుముల్లేకుండా లభిస్తుంది.
ఖాతాల్లో పురోగతి
మొదట్లోనే ఎంతో మంది నుంచి ఆసక్తి పొందిన ఈ పథకం క్రమక్రమంగా దేశవ్యాప్తంగా మారుమూలలకూ విస్తరించింది. దీని ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు బ్యాంకర్లు ఎంతగానో కృషి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసిన కృషి ప్రశంసనీయం. తద్వారా ఇప్పటివరకూ 30.64కోట్ల మంది ప్రజలను జన్ధన్ ఖాతాలను తెరిచారు. తాజా సమాచారం ప్రకారం 68,528.84 కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లో జమ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షించిన విధంగా ఈ పథకం ద్వార ఎంతో మందికి ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ పథకాల ద్వారా జరిగే ఆర్థిక లబ్దిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయడం మొదలైంది.
రూపే కార్డులు
ప్రజల్లో నగదు లావాదేవీలను తగ్గించి, బ్యాంకు వినియోగాన్ని పెంచడం ద్వారా వారికి ఆర్థిక అలవాట్లు, పొదుపుపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జన్ధన్ ఖాతాదారులందరికీ రూపే కార్డులను జారీచేశారు. వీరు దేశంలోని ఏ ఏటీఏం ద్వారానైనా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. కార్డు జారీల్లో బ్యాంకులు కాస్త అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయనే చెప్పాలి. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐలో జన్ధన్ ఖాతా దారుల సంఖ్య10.50 కోట్లుండగా ఖాతాదార్లకు జారీచేసిన రూపే కార్డుల సంఖ్య 7.03 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లీడ్ బ్యాంక్ 2.38 కోట్ల ఖాతాలను తెరవగా జారీ చేసిన కార్డుల సంఖ్య 1.92 కోట్లు. తెలంగాణ రాష్ట్ర లీడ్ బ్యాంకు ఒకప్పుడు ఎస్బీహెచ్ కాగా ప్రస్తుతం అది ఎస్బీఐలో విలీనం అయింది.
ప్రభుత్వ పథకాలపై ఆసక్తి చూపని ప్రయివేటు బ్యాంకులు
జన్ ధన్ యోజనలో భాగంగా ఖాతాలు తెరిచేందుకు ప్రయివేటు బ్యాంకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మొత్తం అన్ని మేజర్ ప్రైవేటు బ్యాంకులు కలిసి 93లక్షల ఖాతాలను తెరవగా అందులో ఉన్న నగదు నిల్వ 20.6 వేల కోట్లు. దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ 34.45 లక్షల ఖాతాలను తెరవగా అందులో అందరికీ రూపే కార్డులను జారీచేసింది. హెచ్డీఎఫ్సీ 17.43,604 ఖాతాలను తెరిపించగా అందులో 17,42,926 మందికి రూపే డెబిట్ కార్డులను ఇచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల అధీకృత బ్యాంకులు, సమన్వయ అధికారులు
ఆంధ్రప్రదేశ్ లీడ్ బ్యాంకర్గా ఆంధ్ర బ్యాంకు జనరల్ మేనేజర్ దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
దీనికి సంబంధించిన సందేహాలకు కావాల్సిన సమాధానాలకు 9618590303, 040 23234625 నంబర్లుకు కాల్ చేయవచ్చు. మెయిల్ ఐడీలు: [email protected], [email protected]
తెలంగాణ లీడ్ బ్యాంకర్గా ఎస్బీఐ ప్రాంతీయ జనరల్ మేనేజర్ శ్రీ అజిత్ సింగ్ వ్యహరిస్తున్నారు. పథకం సంబంధించిన మరింత సమాచారం, సందేహాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబరు : 7674088842, మెయిల్ ఐడీ: [email protected]
రెండు రాష్ట్రాల జన్ ధన్ ఖాతాదారులు టోల్ఫ్రీ నంబరు 1800-425-8525 సైతం ఫోన్ చేయవచ్చు.