బ్యాంకింగ్ యాక్ట్ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదముద్ర
‘ఎన్పీఏ సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సమర్ధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రుణాలపై బ్యాంకర్లే నిర్ణయం తీసుకుంటారు కనుక.. నిబంధనలకు అనుగుణంగా మార్పులపైనా వారే నిర్ణయం తీసుకోవాల
బ్యాంకింగ్ రంగంలో వసూలు కాని రుణాలను ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టంలోని మార్పులకు సంబంధించిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. గత రెండు దశాబ్దాల నుంచి కార్పొరేట్లు వేల కోట్ల రుణాలను తీసుకుని బకాయిలను చెల్లించడం లేదన్న విమర్శలున్నాయి. విజయ్ మాల్యా లాంటి బడా వ్యాపారవేత్తలు దేశం వదిలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో మొండి బకాయిలను తగ్గించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పరిణామాలకు సంబంధించిన విశేషాలు మరికొన్ని...
సమర్థ పరిష్కారాల కోసం బ్యాంకింగ్ చట్టానికి సవరణలు
బ్యాంకింగ్ వ్యవస్థను వేధిస్తోన్నవసూలు కాని రుణాల సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగ చట్టంలో ప్రతిపాదించిన సవరణలు దోహదం చేస్తాయని ఆర్థికశాఖ అభిప్రాయపడింది. ‘నికర నిరర్థక ఆస్తులు ఎంత మేర తగ్గుతాయని చెప్పడం నాకు కష్టమే. అయితే మొండి బకాయిల సమస్యను మరింత సమర్ధంగా పరిష్కరించేందుకు ఈ సవరణలు తోడ్పడతాయని భావిస్తున్నాం' అని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా విలేకరులతో అన్నారు.
ఆర్బీఐకి మరిన్ని అధికారాలు
ఈసారి వర్షకాల సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభలో ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ‘ఒత్తిడి రుణాల కేసులు పరిష్కరించేందుకు ఆర్బీఐ, బ్యాంకులకు ప్రతిపాదిత సవరణలు వీలు కల్పిస్తాయ'ని లావాసా భరోసా వ్యక్తం చేశారు. ఆర్డినెన్సు నోటిఫై అయ్యాక వివరాలను ప్రభుత్వమే బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. వివిధ వర్గాల వాటాదార్లతో సంప్రదింపుల అనంతరం, చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా ఆయన వెల్లడించారు.
బ్యాంకర్లదే బాధ్యత
‘ఎన్పీఏ సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సమర్ధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రుణాలపై బ్యాంకర్లే నిర్ణయం తీసుకుంటారు కనుక.. నిబంధనలకు అనుగుణంగా మార్పులపైనా వారే నిర్ణయం తీసుకోవాల'ని లావాసా చెప్పారు. ఎన్పీఏకు సంబంధించిన తాకట్టు ఆస్తులను కొనుగోలు చేసేందుకు మార్కెట్లో తదనుగుణమైన పరిస్థితులు ఉన్నాయని నొక్కిచెప్పారు. ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఎన్పీఏల పరిస్థితి గతంలో లాగా లేదు
‘ఎన్పీఏల పరిస్థితి గతం మాదిరి అధ్వానంగా లేదు. విద్యుత్, రహదారులు లాంటి మౌలిక రంగాల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంద'ని పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్- డిసెంబరులో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రావాల్సిన మొండి బకాయిలు రూ.లక్ష కోట్ల వరకు పెరిగి రూ.6.06 లక్షల కోట్లకు చేరాయి. 2016 మార్చి చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నికర నిరర్థక ఆస్తులు రూ.2.67 లక్షల కోట్ల నుంచి పెరిగి రూ.5.02 లక్షల కోట్లకు చేరాయి. ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు వసూలు కాని రుణాలపై బ్యాంకు యాజమాన్యాలు ఒత్తిడి తెస్తే కానీ ఈ రంగంలో ఈ జాడ్యం వదిలేలా కనిపించడం లేదు.