మేజర్ రవాణా హబ్గా కృష్ణపట్నం పోర్టు: సముద్ర రవాణాకు ఆంధ్రా అదరహో
గతేడాది ఒమెన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు సముద్ర అనుసంధానాన్ని పూర్తిచేసిన మెర్స్క్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్ట్ కంటెయినర్ టర్మినల్(కేపీసీటీ)ని కీలకంగా ఉపయో
గతేడాది ఒమెన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు సముద్ర అనుసంధానాన్ని పూర్తిచేసిన మెర్స్క్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్ట్ కంటెయినర్ టర్మినల్(కేపీసీటీ)ని కీలకంగా ఉపయోగించేందుకు మెర్స్క్ లైన్ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నది. ఈ దిశంలో ఈస్ట్ కోస్ట్లో మేజర్ ట్రాన్స్ షిప్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కృష్ణపట్నంలోని టర్మినల్లో మెర్స్క్ లైన్కు సంబంధించి సముద్ర రవాణాకు అవసరమైన పనులన్నీ యుద్దప్రాతిపదికన సిద్దమయ్యాయి. అనుకున్నట్లే మిగిలిన ప్రణాళికలన్నీ పూర్తయితే కేపీసీటీ టర్మినల్ మంచి రవాణా కేంద్రంగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే వస్తువులను, కంటెయినర్లను తరలించే క్రమంలో కేపీసీటీని మంచి కేంద్రంగా ఉపయోగించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నారు. ఇవన్నీ సంపూర్ణంగా జరిగితే సరుకులను ఇతర దేశాల పోర్టుల నుంచి తెచ్చి మొదట కేపీసీటీలో దించుతారు. ఆ తర్వాత రైల్వే, రోడ్డు మార్గాల్లో ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.
ఈ మధ్య తీసుకున్న చర్యల కారణంగా కంటెయినర్ల ద్వారా జరిగే వ్యాపారం ఇతోధికంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని కేపీసీటీ సీఈవో అనిల్ ఎండ్లూరి చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాపారం పుంజుకోవడంతో పాటు వస్తు రవాణా వేగం పెరగగలదు అని ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణపట్నం టర్మినల్ను అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో 60 లక్షల టీఈయూల(టోటల్ ఈక్వివలెంట్ యూనిట్ల) సామర్థ్యం ఉండేలా నిర్మించారు.