నోట్ల ర‌ద్దు ప్ర‌భావం వివిధ రంగాల‌పై ఎటువంటి ప్ర‌భావం చూపుతోంది?

నోట్ల రద్దు వల్ల వివిధ రంగాలపై పడుతున్న ప్రభావాలను కేంద్రం అర్ధం చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాలి. మొద‌ట్లో న‌ల్ల‌ధ‌నం, నకిలీ క‌రెన్సీ అని చెప్పి ఇప్పుడు మ‌ళ్లీ

న‌ల్ల‌ధ‌నాన్ని క‌ట్ట‌డి చేసేందుకు, న‌కిలీ క‌రెన్సీ చెలామ‌ణీని అడ్డుకునేందుకు కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల మార్పిడి నిర్ణ‌యం దేశ‌వ్యాప్తంగా అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నా కింది స్థాయి వర్గాలు ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తున్నాయి. ఇదే సందర్భంలో తాను తీసుకున్న విధానం ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తుందన్న సంకేతాలను అట్ట‌డుగు వ‌ర్గాల్లోకి పంపాల్సి ఉంది. తక్షణం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి. పన్నులు గణనీయంగా తగ్గిపోయేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఎప్పుడో రెండేళ్లకో, మూడేళ్లకో అంటే కుదరదు. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంది. నాలుగైదు నెలల పరిమిత సమయంలోనే జరగాలి. నోట్ల రద్దు వల్ల వివిధ రంగాలపై పడుతున్న ప్రభావాలను కేంద్రం అర్ధం చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాలి. మొద‌ట్లో న‌ల్ల‌ధ‌నం, నకిలీ క‌రెన్సీ అని చెప్పి ఇప్పుడు మ‌ళ్లీ న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ అని జ‌పించ‌డం కేంద్రంపై ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ నేప‌థ్యంలో వివిధ రంగాల‌పై నోట్ల ర‌ద్దు ప్రభావాన్ని విశ్లేషిద్దాం.

1. చిన్న వ్యాపారాలు

1. చిన్న వ్యాపారాలు

రోజు కూర‌గాయ‌లు అమ్మేవారు, కిరాణా కొట్టువాళ్లు, పాల‌, పండ్ల దుకాణాల వాళ్ల‌కు న‌గ‌దు కొర‌త‌తో వ్యాపారం తగ్గుతోంది. 2000 నోటుకు చిల్ల‌ర ఇవ్వ‌లేక, బిజినెస్‌ను వ‌దులుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చిన్న మెడిక‌ల్ దుకాణాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా వ‌ర‌కూ ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు మందుల‌ను బ‌య‌ట కొనుక్కోమ‌ని చెబుతున్నాయి. అన్ని దుకాణాల్లో పీవోఎస్‌(పాయింట్ ఆఫ్ సేల్స్‌) లేక‌పోవ‌డం ఒక లోటు అయితే, మ‌రో వైపు చాలా మంది గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల వ‌ద్ద ఏటీఎమ్ కార్డులు లేవు. ఉన్నా వాడ‌టం చాలా మందికి తెలియ‌దు. దీనిపై ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త లేకుండా నోట్ల‌ను మార్చ‌డం వల్ల వృద్దులు, నిరక్ష‌రాస్యులు ఆపపోపాలు ప‌డుతున్నారు.

2. బ్యాంకింగ్ రంగం

2. బ్యాంకింగ్ రంగం

డిపాజిట్ల‌లో పెద్ద ఎత్తున వృద్ది జ‌ర‌గ‌నుంది. ఎవ‌రైతే చ‌ట్ట‌బద్దంగా న‌గ‌దుతో వ్యాపారాలు జ‌రుపుతూ ఉంటారో వారంతా ఇప్పుడు వ్య‌వ‌స్థీకృత బ్యాంకింగ్ రంగం వైపు మ‌ళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు పోటెత్తుతున్నాయి. ఈ నెలాఖ‌రుకు బ్యాంకుల‌కు రూ. 15 ల‌క్ష‌ల కోట్లు చేరుతాయ‌ని ఒక అంచ‌నా. ఇంత మొత్తం బ్యాంకుల్లోడిపాజిట్ అయిన త‌ర్వాత తిరిగి ఆర్థిక వ్య‌వస్థ‌లోకి రాదు. క‌నీసం రూ. 3 ల‌క్ష‌ల కోట్లు బ్యాంకుల వ‌ద్దే ఉండ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు. దీంతో బ్యాంకుల ఆర్థిక స్థితిలో సానుకూల మార్పు కార‌ణంగా వ‌డ్డీ రేట్లు త‌గ్గే అవ‌కాశం ఉంది. మ‌రో వైపు వ్యాపార‌స్థులు, వినియోగదారుల చేత‌ న‌గ‌దు లావాదేవీల‌ను త‌గ్గించి న‌గదు ర‌హిత లావాదేవీల‌ను చేసే దిశ‌గా ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇది డిజిట‌ల్ బ్యాంకింగ్‌కు లాభించే అంశం.

3. ఆభ‌ర‌ణాలు,న‌గ‌ల వ్యాపారం

3. ఆభ‌ర‌ణాలు,న‌గ‌ల వ్యాపారం

అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన‌ట్లుగానే బంగారం అమ్మ‌కాల‌పైనా పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం చూపింద‌ని ఎంబీఎస్ జ్యువెల‌ర్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత ఎస్ జేజాని ఒక టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో తెలిపారు. ప్ర‌స్తుతం రూ. 2 ల‌క్ష‌ల‌కు మించిన రిటైల్ కొనుగోళ్ల‌కు వినియోగ‌దార్ల‌ను పాన్‌కార్డులు అడుగుతున్నారు. వివాహాలు, ఇత‌ర‌త్రా వేడుక‌ల‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున బంగారం కొంటూ ఉంటారు. చాలా మంది గ్రామీణుల‌కు పాన్‌కార్డులు ఉండ‌వ‌నేది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హస్యం. ప్ర‌భుత్వం బంగారు కొనుగోళ్ల‌పై గ‌ట్టి నిఘా ఉంచ‌డంతో బంగారు వ్యాపారాలు వెలవెల‌బోతున్నాయ‌నేది రిటైల్ ప‌సిడి దుకాణాల వాద‌న. అయితే ఇక్క‌డ రెండు అంశాలు ప‌రిశీలించాల్సి ఉంది. ఒక ప‌క్క ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ పెద్ద ఎత్తున పాత నోట్ల‌(నల్ల‌ధ‌నం)ను బంగారం రూపంలోకి మార్చ‌డానికి వ్యాపారులు స‌హ‌క‌రిస్తున్నార‌నేది అంద‌రికీ తెలిసిన నిజం. దీనిపై బంగారం దుకాణాల వ‌ర్త‌క సంఘాలు స్పందించాల్సి ఉంది. మ‌రో వైపు వ్య‌వ‌సాయ‌దారులు, చిన్న వ్యాపారులు పాన్ కార్డు లేక‌పోతే రూ. 2 లక్ష‌ల‌కు పైబ‌డి ఎలా కొనుగోళ్లు చేయాలో ప్ర‌భుత్వాలు సెలవివ్వాల్సిన అవ‌స‌రం ఉంది.

4. రియ‌ల్ ఎస్టేట్

4. రియ‌ల్ ఎస్టేట్

అవ్య‌వ‌స్థీకృత రంగంలో ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పించేది స్థిరాస్తి రంగం. పెద్ద నోట్ల ర‌ద్దుతో బిల్డ‌ర్లు కూలీల‌కు రోజువారీ డ‌బ్బులు చెల్లించ‌లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టి ప్రాజెక్టుల‌ను స‌గంలో ఆపేయాల్సిన ప‌రిస్థితి ఉంది. రిటైల్ రుణ చెల్లింపు సంస్థ‌లు, బ్యాంకింగేత ఆర్థిక సంస్థ‌లు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల‌కు వ‌చ్చే ఆరు నెల‌లు న‌గ‌దు కొర‌త తీవ్రంగా ప్ర‌భావం చూపించ‌నుంది. చాలా చోట్ల భూముల ధ‌ర‌ల‌కు బూమ్ త‌గ్గే అవ‌కాశం ఉంది. దీంతో కొద్ది కాలం పాటు సిమెంటు, స్టీల్‌, నిర్మాణ‌, గృహోప‌క‌ర‌ణ సామాగ్రి కంపెనీల‌కు క‌ష్టాలు తప్పేలా లేదు. అవ‌న్నీ చాలా వ‌ర‌కూ బిజినెస్‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది.

5. వాహ‌న రంగం

5. వాహ‌న రంగం

వాహ‌న త‌యారీ కంపెనీల‌పై నోట్ల ర‌ద్దు తీవ్ర ప్ర‌భావ‌మే చూపుతోంది. న‌వంబ‌రులో చాలా కంపెనీల అమ్మ‌కాలు త‌గ్గిపోయాయి. చాలా నెల‌ల త‌ర్వాత నెమ్మ‌దిగా సాధార‌ణ స్థాయి అమ్మ‌కాల‌ను చేరుకుంటున్న ద్విచ‌క్ర వాహ‌న కంపెనీల‌కు ఈ నిర్ణ‌యం శ‌రాఘాతంగా మారింది. ఈ కంపెనీలు ఆరు నెల‌ల నుంచి ఏడాది కాలం పాటు కోలుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని ఆటోమొబైల్ రంగ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో వాహ‌నాల అమ్మ‌కాల‌కు 20 శాతం గండి ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లేస్తున్నారు. గ‌ణ‌నీయంగా అప్పుల‌పై ఆధార‌ప‌డే వాణిజ్య‌(ఎల్‌సీవీ; హెచ్‌సీవీ) వాహ‌నాల అమ్మ‌కాల ప‌రిస్థితి మ‌రీ దారుణం.

6.కంపెనీల ఆదాయాలపై ప్ర‌భావం

6.కంపెనీల ఆదాయాలపై ప్ర‌భావం

నోట్ల ర‌ద్దుతో ఎఫ్ఎమ్‌సీజీ, ఎల‌క్ట్రానిక్స్‌, విలాస వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు, న‌గ‌లు, సిమెంట్‌, ఉక్కు, గృహోప‌క‌ర‌ణాలు, గ్రానైట్‌, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్ సంబంధిత కంపెనీలు ఆప‌సోపాలు ప‌డుతున్నాయి. కొన్ని రంగాల అమ్మ‌కాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. రియ‌ల్ ఎస్టేట్ దెబ్బ‌తిన‌డంతో 50 కిలోల సిమెంట్ బ‌స్తా ధ‌ర నెల రోజుల్లోనే రూ.20 వ‌రకూ దిగొచ్చంద‌ని నిర్మాణ రంగ నిపుణులు చెపుతున్నారు. చాలా కంపెనీల ఆర్థిక ప‌రిస్థితి వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికానికి కానీ సాధార‌ణ స్థితికి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

7. ప‌న్ను వ‌సూళ్లు

7. ప‌న్ను వ‌సూళ్లు

ప్ర‌స్తుతం వ‌ర్థ‌మాన దేశాల‌న్నింటిలో జీడీపీ ఆశాజ‌న‌కంగా ఉంది. ఆయా దేశాల జీడీపీల్లో ప‌న్నుల రాబ‌డి స‌గ‌టున 20 శాతానికి పైగా ఉంది. మ‌న దేశంలో ఇది 15 నుంచి 16 శాతం మధ్య క‌ద‌లాడుతోంది. ఓఈసీడీ దేశాల్లో ఇది 35 శాతంగా ఉందంటే ఆ దేశాల ప‌న్నుల వ్య‌వ‌స్థ ఎంత ప‌టిష్టంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం రూ. 500, 1000 నోట్ల ర‌ద్దుతో ప‌న్నుల వ‌సూళ్లు పెరిగి ప్ర‌భుత్వ రాబ‌డి పెర‌గ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని పెద్ద న‌గ‌రాల్లో ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బ‌కాయిలు, నీటి బిల్లుల చెల్లింపుల‌కు పాత రూ. 500 నోట్లు వాడార‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ప‌న్ను వ‌సూళ్లలో వృద్ది కార‌ణంగా ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితి మెరుగ‌యి గ్రామీణ మౌలిక స‌దుపాయాలు, గృహ వ‌స‌తికి ప్ర‌భుత్వం అధిక కేటాయింపులు చేసే వీలు క‌లుగుతుంది. ధ‌రోల్బ‌ణం కాస్త త‌గ్గితే ఆర‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను మ‌రింత త‌గ్గించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో స్థిరాస్తి కొనుగోళ్లు నెమ్మ‌దిగా పుంజుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల వైపు నుంచి కొనుగోలు శ‌క్తి పెరిగినా నిర్మాణ రంగంలో బిల్డ‌ర్లు ఇంటి ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోతారా అనే వేచి చూసే స్థితి ప్ర‌స్తుతం మార్కెట్లో నెల‌కొని ఉంది.

8. పెట్టుబ‌డిదారులు ఏం చేయాలి?

8. పెట్టుబ‌డిదారులు ఏం చేయాలి?

మిగ‌తా పెట్టుబ‌డుల‌తో పోలిస్తే ఈక్విటీల్లో రిస్క్ ఎక్కువే. అలాగే రాబ‌డి ఎక్కువే. స్టాక్ మార్కెట్‌ను నిత్యం ప‌రిశీలించే అలవాటు ఉంటే నేరుగా కంపెనీ షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. లేక‌పోతే న‌మ్మ‌క‌మైన ఫైనాన్సియ‌ల్ అడ్వైజ‌ర్ స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటించాలి. ఊరికే రుసుములు తీసుకుని ఏదో పెట్టుబ‌డి మార్గాన్ని సూచించే ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణుల జోళికి వెళ్లొద్దు. దాని క‌న్నా ఆన్‌లైన్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ స‌ల‌హాలిచ్చే వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. దానికి మంచి ఉదాహ‌ర‌ణలు అర్థ‌యంత్ర‌(https://www.arthayantra.com/), ఫండ్స్ ఇండియా(fundsindia.com) వంటివి. బ్యాంకు ఎఫ్‌డీల‌పై వడ్డీ ఏడాదికి రూ.10వేలు దాటితే దానిపై వర్తించే పన్ను శ్లాబులను బట్టి 10% నుంచి 30% పన్ను కట్టాలి. స్టాక్ మార్కెట్లో నేరుగా మదుపు చేసినా, మ్యూచువల్‌ ఫండ్‌ మార్గంలో పెట్టుబడి పెట్టి.. ఏడాది తర్వాత ఎన్ని కోట్ల రూపాయల లాభం వచ్చినా మీరు పైసా కూడా పన్నుకట్టక్కర్లేదు. ఇవన్నీ బేరీజు వేసుకుని మీకు న‌ప్పే మంచి పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+