టాటా గ్రూపులోని అన్నీ కంపెనీల నుంచి వైదొలగిన సైరస్ మిస్త్రీ
టాటా గ్రూపు కంపెనీల నుంచి వైదొలగుతున్నట్లు, తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సైరస్ మిస్త్రీ సోమవారం ప్రకటించారు. టాటాలపై న్యాయపోరాటం కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
టాటా గ్రూపు కంపెనీల నుంచి వైదొలగుతున్నట్లు, తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సైరస్ మిస్త్రీ సోమవారం ప్రకటించారు. టాటాలపై న్యాయపోరాటం కొనసాగిస్తానని ఆయన తెలిపారు. వ్యవస్థలో సంస్కరణల కోసమే నా పోరాటం.. ఆ కారణంగానే నన్ను తొలగించారని మిస్త్రీ ఆరోపించారు. "పదవిలో ఉన్న కాలంలో పాలనా సమస్యలను ఎదుర్కొన్నాను. నైతిక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. ఈ విషయాలేవి ప్రపంచానికి తెలియవ"ని ఆయన చెప్పారు. గత అక్టోబర్ 24న టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించగా.. నాటి నుంచి మిస్త్రీ, రతన్ టాటా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత టాటా గ్రూపులో కీలకమైన టీసీఎస్ నుంచి కూడా మిస్త్రీని తొలగించారు. దీంతో ఈ వివాదం తీవ్రత పెరిగింది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించిన అనంతరం తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే. ఆయన నేతృత్వంలోకి కమిటీ నాలుగు నెలల్లో కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తుందని వెంటనే ప్రకటించారు.
టాటా సన్స్ గ్రూపు కంపెనీల నుంచి మిస్త్రీకి పూర్తిస్థాయిలో ఉద్వాసన పలికే ప్రయత్నాలను ఆ గ్రూప్ వేగవంతం చేయడంతో మిస్త్రీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మిస్త్రీని పూర్తి స్థాయిలో తప్పించే ప్రయత్నాల్లో భాగంగానే .. టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఆ కంపెనీ డైరెక్టర్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. టీసీఎస్ సహా ఏడు కంపెనీల బోర్డు డైరెక్టరు పదవుల నుంచి మిస్త్రీని తొలగించేందుకు ఈ నెలలో వరుస అసాధారణ సర్వసభ్య సమావేశాలను (ఈజీఎం) నిర్వహించేందుకు టాటా సన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.