30 వేల చేరువకు బంగారం ధర
తెలుగు గుడ్రిటర్న్స్ తమ పాఠకుల కోసం కొత్త ఫీచర్ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్తలు సంక్షిప్తంగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ వార్తలను చదివేలా ఒకే కథనంలో అన్ని వార్తలను సంక్షి
తెలుగు గుడ్రిటర్న్స్ తమ పాఠకుల కోసం కొత్త ఫీచర్ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్తలు సంక్షిప్తంగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ వార్తలను చదివేలా ఒకే కథనంలో అన్ని వార్తలను సంక్షిప్తీకరిస్తోంది. ఉద్యోగ జీవితాలతో అందరూ బిజీగా ఉంటున్న సమయం ఇది. అలాంటి వారి కోసమే ముందు రోజు వార్తలు సంక్షిప్తంగా, వేగంగా చదివేందుకు. దీని ద్వారా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్; బంగారం ధరలను ఒకేచోట తెలుసుకోండి.
డిసెంబరు 30 వరకూ రూపే కార్డు లావాదేవీలపై రుసుములుండవ్
నవంబరు 11 నుంచి రూపే కార్డు లావాదేవీల రుసుములను తొలగిస్తున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. అన్ని పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్), ఈ-కామర్స్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. డిసెంబరు 30 వరకూ ఇది అమల్లో ఉంటుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చంద్రబాబుపై ప్రశంసలు
అభివృద్దిలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ఫలితాలను కానేఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సిఐఐ) ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అభినందనలు తెలిపింది. వ్యాపారానికి అనువైన ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుండి, స్ఫూర్తివంతంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఆలోచనలు భేష్ అనిపించేలా ఉన్నాయంటూ వస్తున్న ప్రశంసలు రాష్ట్ర ప్రగతికి మరింత ఊతం ఇస్తున్నాయి. సిసిఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించారు.
ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించిన పలు విషయాలను ఇక్కడ తెలుసుకోండి
యూకే-తెలంగాణ బిజినెస్ చాంబర్ ఏర్పాటు
రాష్ట్రంలో బ్రిటన్తోపాటు యూరప్ దేశాల పెట్టుబడులకు వీలు గా యూకే-తెలంగాణ బిజినెస్ చాంబర్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి సాయపడతామని వారు తెలిపారు. బ్రిటన ఎంపి వీరేంద్ర శర్మ, బ్రిటిష్ దక్షిణ భారతదేశ వ్యవహారాల సమన్వయకర్త సుజిత ఎస్ నాయర్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనా చారిని కలిశారు.ఈ రెండు రోజులు బ్రిటన్ పార్లమెంటరీ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అధ్యయన యాత్రలో భాగంగా బ్రిటన బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించనుంది.
డిసెంబరు చివరకు సెన్సెక్స్ 29 వేలకు
పెద్ద నోట్ల రద్దు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు అనంతరం మార్కెట్ ప్రతికూలంగా కదలాడుతున్నప్పటికీ సెన్సెక్స్ లక్ష్యంలో ఎలాంటి మార్పు చేయడం లేదని హెచ్ఎస్బీసీ ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగానే డిసెంబరు చివరికల్లా 29000 పాయింట్లకు వెళుతుందని అంచనా వేస్తోంది. అలాగే 2017 చివరికల్లా 32,400 పాయింట్ల లక్ష్యాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. పై రెండు కీలక పరిణామాలు స్వల్ప కాలం పాటే ప్రభావం చూపుతాయని తెలిపింది. ఒకవేళ ఒడుదొడుకులు ఎదురైనా మిగిలిన ఆసియా మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లకు తక్కువగానే ఉంటాయని పేర్కొంది.
ఇకపై వాట్సాప్ వీడియో కాలింగ్
వీడియో కాలింగ్ను వాట్సప్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే ప్రత్యర్థి యాప్లు స్కైప్తోపాటు యాపిల్కు చెందిన ఫేస్టైమ్, గూగుల్ డ్యూయో వీడియో కాలింగ్ను మొబైల్ వినియోగదారులకు పరిచయం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ కూడా వీడియో కాలింగ్ను తీసుకొస్తోంది. మరికొద్ది రోజుల్లో 100 కోట్లకుపైగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారని ఆ సంస్థ తెలిపింది.
అరుణ్ జైట్లీని కలిసిన రతన్ టాటా
టాటా సన్స్ సంక్షోభం నేపథ్యంలో దాని తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టాటా గ్రూప్లో నెలకొన్న పరిస్థితుల గురించి రతన్ టాటా ఓ లేఖను రాయగా, జైట్లీతో తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఏం మాట్లాడారన్న దానిపై స్పందించేందుకు రతన్ టాటా నిరాకరించారు. గత నెల టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్ర్తికి టాటాలు ఉద్వాసన పలికినది తెలిసిందే.
వేతనాల్లో 10% పెరుగుదల
వచ్చే సంవత్సరం ఉద్యోగుల వేతనాల్లో సరాసరిన 10 శాతం పెరుగుదల ఉండొచ్చని గ్లోబల్ అడ్వయిజరీ సంస్థ విల్లీస్ టవర్స్ వాట్సన్ నివేదిక అంచనా వేసింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగులకు ఇంతకన్నా ఎక్కువ పెరుగుదలే ఉండొచ్చని పేర్కొంది. కంపెనీలు ఇలాంటి ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపింది. 2016లో వేతనాలు 10.8 శాతం పెరుగుతాయని సంస్థ గతంలో అంచనావేసింది. అయితే ప్రస్తుతం ఈ అంచనా 10 శాతానికే పరిమితం అయిందని తెలిపింది. ఇదే లెక్కన ద్రవ్యోల్బణ సరాసరిని లెక్కలోకి తీసుకొని మదింపు చేస్తే 2017లో వేతనాల వాస్తవిక పెరుగుదల 4.3 శాతానికే పరిమితం కావచ్చని పేర్కొంది.
ధరలు తగ్గాయ్
కూరగాయల ధరలు తగ్గడంతో పాటు ఆహార వస్తువుల విభాగంలో ధరల తగ్గుదలతో అక్టోబరు నెలలో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ), వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాలు రెండూ గణనీయంగా తగ్గాయి. డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం 3.39 శాతానికి దిగజారగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.20 శాతానికి క్షీణించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇంత దిగువకు రావడం 14 నెలల తర్వాత ఇదే ప్రథమం.
ఎగుమతుల జోష్
దేశీయ ఎగుమతులు గత నెల అక్టోబర్లో 9.59 శాతం పెరిగాయి. ఇంజినీరింగ్, పెట్రోలియం, రత్నాలు, ఆభరణాల రంగాల ఎగుమతులు పుంజుకున్నాయి. దీంతో 10 నెలల గరిష్ఠాన్ని తాకగా, 23.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు బంగారం దిగుమతులూ పెరగడంతో మొత్తం దేశీయ స్థూల దిగుమతులూ ఎగిశాయి. 33.67 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లను చేరింది.
30 వేల చేరువకు బంగారం ధర
పసిడి ధరలు మూడు వారాల కనిష్ఠానికి చేరాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.485 తగ్గి రూ.30,030 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా పరిణామాలతో పాటు ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్ తగ్గడమే ఇందుకు నేపథ్యం. ఇక కేజీ వెండి సైతం రూ.2720 క్షీణించి కీలకమైన రూ.45,000 దిగువకు చేరింది. చివరకు రూ.42,700 వద్ద ముగిసింది. అక్టోబరు 21 తర్వాత వెండికిదే కనిష్ఠ స్థాయి. అంతర్జాతీయంగా మాత్రం మూడు రోజుల నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ.. బంగారం మెరిసింది. న్యూయార్క్లో ఔన్సు పసిడి ధర 0.5 శాతం పెరిగి 1,226.06 డాలర్లకు చేరింది. వెండి సైతం 0.8 శాతం సైతం లాభపడి 17.02 డాలర్లకు చేరింది.