గ్రీస్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జీఎంఆర్ బిడ్లు
దేశీయ ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ తాజాగా గ్రీస్లోని క్రీట్లో కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రీస్కు చెందిన జీఈకే టెర్నా సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి బిడ్ వే
దేశీయ ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ తాజాగా గ్రీస్లోని క్రీట్లో కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రీస్కు చెందిన జీఈకే టెర్నా సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి బిడ్ వేసినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఈకే టెర్నా గ్రీస్ దేశానికి చెందిన మౌలిక సదుపాయాల సంస్థ. గ్రీస్ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ప్రాజెక్టు విలువ సుమారు 850 మిలియన్ యూరోలని (దాదాపు రూ. 6,120 కోట్లు) వివరించింది. కాంట్రాక్టు కింద క్రీట్లోని హెరాక్లియోన్ నగరంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ, తత్సంబంధిత రహదారుల ఏర్పాటు మొదలైన అంశాలు ఉంటాయి. ఈ విమానశ్రయ ఒప్పందం 35 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. దీనికి దాఖలైన ఏకైక బిడ్ తమదేనని భావిస్తున్నట్లు జీఎంఆర్ వెల్లడించింది. ప్రాజెక్టు దక్కిన పక్షంలో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సంస్థ విమానాశ్రయ నిర్వహణదారుగా ఉంటుంది.
ఏటా 2.4 కోట్ల మంది టూరిస్టులు గ్రీస్ను సందర్శిస్తారని అంచనా. ఇందులో ఎక్కువ మంది అతి పెద్ద దీవి అయిన క్రీట్ను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడి హెరాక్లియోన్ విమానాశ్రయం గ్రీస్లో రెండో పెద్ద ఎయిర్పోర్టు. అయితే, సామర్థ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నందున ప్రభుత్వం మరో విమానాశ్రయాన్ని తలపెట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేయనున్నారని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి.