జనవరిలోనే బడ్జెట్కు ఆర్థిక శాఖ కసరత్తు
2017-18 నుంచి బడ్జెట్ను జనవరి 31నే ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సన్నద్దమవుతోంది. దీంతో ఆర్థిక బిల్లుకు ఏప్రిల్ 1లోగా ఆమోదం తెలిపేందుకు మూడు నెలల సమయం ఉంటుంది. బడ్జెట్ తేదీ గురించి నిర్ణయాన్ని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకుంటుంది. దీనికి సంబంధించి తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల షెడ్యూల్ను అనుసరించి ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వచ్చే సంవత్సరంలో ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్లనున్నాయి. నార్త్బ్లాక్లో ఉన్న బడ్జెట్ తయారీదార్లు, పాలసీ నిర్ణేతలు జనవరి 31న బడ్జెట్ తయారుచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 2016-17 ఎకనమిక్ సర్వేను జనవరి 30 సోమవారం సమర్పించిన తర్వాత బడ్జెట్ను మంగళవారం(జనవరి 31) పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బడ్జెట్ తేదీని ముందుకు జరపడమే కాకుండా మొదటిసారి వచ్చే ఏడాది ప్రధాన బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను కలుపుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 1, 2017 నుంచి పంచ వర్ష ప్రణాళికలు ఉండబోవు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయ విభజన భవిష్యత్తులో ఉండబోదు. బడ్జెట్లో కేవలం రెవెన్యూ, మూలధన వ్యయాలుగా వర్గీకరణ ఉంటుంది.