అడ్వర్టైజింగ్ కౌన్సిల్పై పరువు నష్టం దావా వేయనున్న పతంజలి
ఎఫ్ఎమ్సీజీలో చాలా ఆలస్యంగా అడుగుపెట్టిన వడివడిగా అడుగులు వేస్తోన్న పతంజలి సంస్థ అడ్వర్టైజింగ్ కౌన్సిల్పై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతోంది. శనివారం బాబా రాందేవ్ ప్రకటించిన దాని ప్రకారం అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(యాస్కి)పై దావా వేయనున్నట్లు పతంజలి ఆయుర్వేద్ పేర్కొంది.
ఇది వరకే పతంజలికి సంబంధించి పలు ప్రకటనలపై యాస్కి అభ్యంతరాలతో పాటు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 'యాస్కీపై మేము పరువు నష్టం దావా వేస్తాం. కోర్టులో కేసు దాఖలు చేస్తాం. ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాం. అవసరమైన చర్యలను త్వరలోనే తీసుకుంటాం.' అని రాందేవ్ బాబా విలేకరుల సమావేశంలో చెప్పారు.

పతంజలి ఉత్పత్తులకు రాందేవ్ బాబా ప్రమోటరుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ నోటీసులను 'ప్రేమలేఖలు'గా ఆయన అభివర్ణించారు. ఇంకా పతంజలికి నోటీసులను పంపడంపై యాస్కీ అధికార, న్యాయ పరిధులను రాందేవ్ ప్రశ్నించారు. 'అదో చట్టవిరుద్ధ సంస్థ. ఈ విషయంపై నేను భారత ప్రభుత్వానికి లేఖ రాస్తాను. యాస్కి అనేది చట్టబద్ధమైన సంస్థ కాదు. కేవలం కంపెనీ మాత్రమే. అది మాకు ప్రేమలేఖలు పంపుతోంది. పార్లమెంటులోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. వివిధ హైకోర్టులు సైతం యాస్కికి రాజ్యాంగబద్ధ అధికారం లేదని తెలిపాయ'ని ఈ సందర్భంగా రామ్దేవ్ పేర్కొన్నారు.
మేలో పతంజలి ఉత్పత్తులైన జీరా బిస్కట్, కాచ్చి ఘని ఆవాల నూనె, కేశ్ కాంతి, దంత్ కాంతి తదితరాలపై యాస్కి 10 నోటీసులు పంపింది. అంతక్రితం మార్చి, ఏప్రిల్లో ఆరు చొప్పున నోటీసులు పంపింది. ఏప్రిల్ 2015-ఏప్రిల్ 2016 మధ్య 30కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచార, ప్రసారాల సహాయ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ పార్లమెంటుకు ఆగస్టు 2న తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పతంజలి
గిరాకీని అందిపుచ్చుకునేందుకు అయిదు ఆహార ఉత్పత్తి యూనిట్లను ప్రాంరభించనున్నట్లు రామ్దేవ్ తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, అసోంలున్నాయి. 2016 చివరికల్లా ఈ యూనిట్లలో చాలా వరకు ప్రారంభం కానున్నాయి. మూడు యూనిట్లపై దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రామ్దేవ్ తెలిపారు. ఎగుమతుల కోసం మార్చి చివరికల్లా నాగ్పూర్లో ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.


Click it and Unblock the Notifications