దేశవ్యాప్తంగా వస్తు, సేవలకు ఒకే పన్ను విధించడంతో పాటు పన్నుపై పన్ను వేసే పద్దతిని మార్చే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను బిల్లు గతేడాదే లోక్ సభలో ఆమోదం పొందింది. ఎట్టకేలకు దాదాపు అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించడంతో రాజ్యసభ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. పరోక్ష పన్నుల విధానంలో ఇది ఒక కీలక ముందడుగు. 25 ఏళ్ల క్రితమే ప్రతిపాదించిన ఈ పన్ను ఎన్డీఏ ధ్రుడ సంకల్పంతో పార్లమెంటు ఆమోదం పొందింది. దీని తర్వాత దేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత దేశమంతా జీఎస్టీ అమలుకు మార్గం ఏర్పాటవుతుంది. ఈ నేపథ్యంలోజీఎస్టీపై పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ఏ పన్నుల స్థానంలో జీఎస్టీ రాబోతుంది?
కేంద్ర పన్నులు
* సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ
* సేవా పన్ను
* అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ(సీవీడీ)
* ప్రత్యేక అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్(ఎస్ఏడీ)
* సెంట్రల్ సేల్స్ ట్యాక్స్
* సెంట్రల్ సర్చార్జీలు,సెస్సులు
రాష్ట్ర పన్నులు
* విలువ ఆధారిత పన్ను
* ఆక్ట్రాయ్, ఎంట్రీ పన్ను
* కొనుగోలు పన్ను
* విలాస పన్ను
* లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్లపై పన్ను
* రాష్ట్ర సెస్సులు,సర్చార్జీలు
* వినోద పన్ను(స్థానిక ప్రభుత్వాలు విధించేవి కాకుండా)
* సెంట్రల్ సేల్స్ ట్యాక్స్(కేంద్రం విధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించేవి)

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
కేంద్ర పన్నులైన సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్ను వంటి వాటి స్థానంలో వివిధ పన్నుల బదులు ఒకే పన్ను వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విలువ ఆధారిత పన్ను, సర్చార్జీలు, సెస్సుల స్థానంలో జీఎస్టీ ఉంటుంది. వినియోగంలోకి వచ్చేముందు ఒకసారి ఈ పన్ను ఉండబోతోంది.
పన్ను పరిధి పెరుగుతుంది. అంటే ఇప్పటివరకూ పన్ను పరిధిలోకి రాని చాలా అంశాలు, వస్తు సేవలను పన్ను పరిధిలోకి తీసుకువస్తారు.
పన్ను ఎగవేతలు తగ్గి, పన్ను వసూళ్లు పెరిగేందుకు జీఎస్టీ ఉపయోగపడగలదు.
జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో జీడీపీకి 1.5 నుంచి 2 శాతం మేర ఆర్థిక లబ్ది చేకూరగలదు.
విద్యుత్, దుస్తులు, ఫుట్వేర్, వైద్యం, విద్య తదితర ఖర్చులు పెరగడం మూలంగా స్వల్పకాంలో రిలైట్ ద్రవ్యోల్బణం 20-70 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని ఒక రేటింగ్ సంస్థ అంచనా వేసింది.

2014 నుంచి ఇప్పటివరకూ జరిపిన కొన్ని సవరణలు వివరాలు ఇవే:
1. అంతరాష్ట్ర వాణిజ్యంపై ఒక శాతం అదనపు పన్నును తొలగించారు. మొదట దీన్ని కేంద్రం విధించి పన్ను జనరేట్ అయ్యే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని ఉంది. ఆర్థిక మంత్రుల సమావేశం తర్వాత దీన్ని తొలగించారు.
2. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ అమలు వల్ల వచ్చే నష్టానికి సంబంధించి కేంద్రం పరిహారం చెల్లించాలి.
ప్రస్తుతానికి ఇది ఐదేళ్ల దాకా పొడిగించాలని ఉంది. భవిష్యత్తులో దీన్ని పార్లమెంటు అనుమతితో మార్చే వెసులుబాటు ఉంది.
3. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తలెత్తే పన్ను వివాదాల పరిష్కారానికి అవసరమైన వ్యవస్థను జీఎస్టీ కౌన్సిల్ నియమిస్తుంది.
4. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే వాటా సెంట్రల్ కంటింజెన్సీ ఫండ్(దేశ సంఘటిత నిధి)లో భాగం కాదంటూ తాజాగా సవరించారు.
5. పరోక్ష పన్నుల్లో కేంద్ర,రాష్ట్రాలకు వాటా ఉంటుంది. దీన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ పన్ను వాటా పంపకాలపై తాజా సవరణలో మరింత స్పష్లతనిచ్చే విధంగా తాజా సవరణలు ఉన్నాయి.

ప్రయోజనం పొందే రంగాలు
జీఎస్టీ అమల్లోకి వస్తే ప్రయోజనం పొందడంలో పది రంగాలు ఉంటే నాలుగు రంగాలు అత్యధికంగా లాభం పొందనున్నాయి. వినియోగం(గిడ్డంగులు), లాజిస్టిక్(ఒక చోట నుంచి మరో చోటకు జరిగే రవాణా), భవనాలకు వనియోగించే పరికరాలు, పారిశ్రామిక తయారీ యూనిట్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తయారీ సంస్థలకు లాభాలు ఎక్కువని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వ్యతిరేక ప్రభావం చూపే రంగాలు
చమురు సహజ వాయు రంగాలపై వ్యతిరేక ప్రబావం ఉండగలదని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సిగరెట్లు ఉత్పత్తి పరిశ్రమలకు ఇబ్బందే. టెలికాం రంగానికి సంబంధించి అంత్య పన్ను పెరగడంతో ఇది ఈ రంగానికి ఇబ్బందే. పెరిగిన పన్నులన్నీ వినియోగదారులకు పాస్ ఆన్ చేయలేని టెలికాం కంపెనీలు సమస్యను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. రుణ ప్రాసెసింగ్ రుసుము, డెబిట్,క్రెడిట్ కార్డు చార్జీలు, బీమా ప్రీమియం వంటివి కాస్త ప్రియం అవ్వవచ్చు.

ద్రవ్యోల్బణంపై ప్రభావం
ప్రస్తుతం ప్రతిపాదించిన జీఎస్టీ మూలంగా వస్తువులపై పన్ను మొత్తంగా తగ్గగలదని భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను లేనట్లే భవిష్యత్తులో కూడా అలానే ఉండొచ్చు. హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ రంగాల్లో చాలా సేవలపై పన్నులు ఉన్నాయి. ఇవి సీపీఐ ద్రవ్యోల్బణ మొత్తం జాబితాలో 25-30 శాతం వరకూ ఉంటాయి. ప్రస్తుతం కొన్నింటిని పన్నుపరిధి నుంచి బయట ఉంచినట్టే జీఎస్టీ అమలు తర్వాత కూడా అలానే ఉంచే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జీఎస్టీ వల్ల ద్రవ్యోల్బణంపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

వినియోగదారులపై ప్రభావం
అ. చాలా ఉత్పత్తులపై పన్ను తగ్గుతుందని భావిస్తున్నందున ఎక్కువ ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చు. కొన్ని వస్తువులపై ప్రస్తుతం పన్ను లేదు. అవి పన్ను పరిధిలోకి వస్తే వాటి ధరలు పెరగొచ్చు.
ఆ. వినియోగదారునికి ఇచ్చే ఇన్వాయిస్లో పన్ను చెల్లింపు పారదర్శకంగా ఉండగలదు.
ఇ. బిల్లు అడిగితే ఎక్కువ చెల్లించే అవసరం, బిల్లు లేకుంటే తక్కువ చెల్లించే అవసరం కొంత కాలం తర్వాత తగ్గిపోయే వీలుంది.
ఈ. జీఎస్టీ అమలు జరిగిన కొంత కాలం తర్వాత రాష్ట్రాల మధ్య వ్యాపారం స్వేచ్చగా జరుగుతుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా వస్తు రవాణా, వ్యాపారం మెరుగుపడి వినియోగదారుడికి అంతిమ ప్రయోజనం కలుగుతుందని విశ్లేషకుల అంచనా.

ట్రేడర్లపై ప్రభావం
టోకు వ్యాపారులు కానీ రిటైలర్లు కానీ ముందు దశల్లో పన్ను చెల్లించిన ఉత్పత్తులకు మళ్లీ పన్ను కట్టాల్సిన పని ఉండదు కాబట్టి, ఉత్పత్తుల(వస్తువుల)ను ఇన్వాయిస్తో తీసుకునేందుకు ఇష్టపడతారు. దీని ద్వారా ప్రభుత్వానికి పన్ను వసూళ్లు ఎక్కువవుతాయి. పన్ను ఎగవేతకు అవకాశం తక్కువ.
సరఫరా విలువలో భాగంగా పన్ను కడతారు.
పన్ను మీద పన్ను కట్టే విధానం పోతుంది కాబట్టి ఉత్పత్తుల, సేవల ధరలు తగ్గుతాయి.
చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్థులు పెద్ద స్థాయిలో విస్తరించేందుకు ప్రయత్నించవచ్చు.

ధరలు తగ్గే అవకాశం ఉన్నవి
ఆటోమొబైల్: తక్కువ స్థాయి కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎస్యూవీలు తగ్గవచ్చు
కారు బ్యాటరీలు: కార్ల బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం
పెయింట్, సిమెంట్ ధరలు తగ్గే వీలు
ఫ్యాన్లు, లైట్లు, వాటర్ హీటర్లు, ఎయిర్కూలర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తగ్గొచ్చు.

ధరలు పెరిగే అవకాశం ఉన్నవి
ప్రస్తుతం ఉన్న సుంకాల కన్నా జీఎస్టీ పొగాకు, సిగరెట్ ఉత్పత్తులపై ఎక్కువ పన్ను విధించే అవకాశం ఉన్నందున సిగరెట్ ధరలు పెరుగుతాయి.
ప్రస్తుతం సేవా పన్ను 15 శాతమే ఉంది. ఒకసారి జీఎస్టీ అమలయితే సేవా పన్ను 18 శాతం వరకూ పెరిగే వీలున్నందున మొబైల్ ఫోన్ బిల్లు పెరగొచ్చు.
రెస్టారెంట్లు, ప్రయాణాలకు సంబంధించి సైతం పన్ను పెరిగే వీలున్నందున బయట తినడానికి మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావొచ్చు.
విమాన ప్రయాణాల టిక్కెట్లు బాగా పెరిగే అవకాశం ఉంది.
బీమా రంగంలో ప్రస్తుతం ఉన్న పన్ను ధరలు 3 శాతం పెరగొచ్చన్న అంచనాతో బీమా పాలసీల ధరలు, ప్రీమియంలు పెరగొచ్చని భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications