జీఎస్టీ బిల్లు మార్పులు-ప్రభావాలు
బుధవారం రాజ్యసభ ముందుకు రానున్న బిల్లులో సవరణలకు సంబంధించిన పత్రాలను మంగళవారం రాజ్యసభ సభ్యులకు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ బిల్లును పాస్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జీఎస్టీ బిల్లుపై చర్చ కోసం 5 గంటల సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకూ జరిపిన కొన్ని సవరణలు వివరాలు ఇవే:
1. అంతరాష్ట్ర వాణిజ్యంపై ఒక శాతం అదనపు పన్నును తొలగించారు. మొదట దీన్ని కేంద్రం విధించి పన్ను జనరేట్ అయ్యే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని ఉంది. ఆర్థిక మంత్రుల సమావేశం తర్వాత దీన్ని తొలగించారు.
2. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ అమలు వల్ల వచ్చే నష్టానికి సంబంధించి కేంద్రం పరిహారం చెల్లించాలి.
ప్రస్తుతానికి ఇది ఐదేళ్ల దాకా పొడిగించాలని ఉంది. భవిష్యత్తులో దీన్ని పార్లమెంటు అనుమతితో మార్చే వెసులుబాటు ఉంది.
3. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తలెత్తే పన్ను వివాదాల పరిష్కారానికి అవసరమైన వ్యవస్థను జీఎస్టీ కౌన్సిల్ నియమిస్తుంది.
4. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే వాటా సెంట్రల్ కంటింజెన్సీ ఫండ్(దేశ సంఘటిత నిధి)లో భాగం కాదంటూ తాజాగా సవరించారు.
5. పరోక్ష పన్నుల్లో కేంద్ర,రాష్ట్రాలకు వాటా ఉంటుంది. దీన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ పన్ను వాటా పంపకాలపై తాజా సవరణలో మరింత స్పష్లతనిచ్చే విధంగా తాజా సవరణలు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
కేంద్ర పన్నులైన సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్ను వంటి వాటి స్థానంలో వివిధ పన్నుల బదులు ఒకే పన్ను వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విలువ ఆధారిత పన్ను, సర్చార్జీలు, సెస్సుల స్థానంలో జీఎస్టీ ఉంటుంది. వినియోగంలోకి వచ్చేముందు ఒకసారి ఈ పన్ను ఉండబోతోంది.
పన్ను పరిధి పెరుగుతుంది. అంటే ఇప్పటివరకూ పన్ను పరిధిలోకి రాని చాలా అంశాలు, వస్తు సేవలను పన్ను పరిధిలోకి తీసుకువస్తారు.
పన్ను ఎగవేతలు తగ్గి, పన్ను వసూళ్లు పెరిగేందుకు జీఎస్టీ ఉపయోగపడగలదు.
జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో జీడీపీకి 1.5 నుంచి 2 శాతం మేర ఆర్థిక లబ్ది చేకూరగలదు.


Click it and Unblock the Notifications