ఎక్కువ శాతం మంది ఏదో క్రమమైన ఆదాయం వచ్చే ఉద్యోగం చేసేందుకే ఇష్టపడతారు. ఎందుకంటే నెలవారీ ఒకసారి జీతం పొందవచ్చు కాబట్టి. అయితే సరైన ప్రణాళిక లేకపోతే ఎంత సంపాదించినా కష్టమే. అందుకే నెలవారీ వేతనంలో ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి రూపంలో మళ్లించడం ఒక ఉత్తమ ఆలోచన. మొదట డబ్బు చేతికందగానే వేగంగా ఖర్చు పెట్టేసి తర్వాత మళ్లీ జీతం కోసం ఎదురుచూడటం, అప్పు చేయడం అంత మంచిది కాదు. అందుకోసమే పెట్టుబడి ప్రణాళిక ఉండాలి. మీరు సంపాదించిన జీతాన్ని పెట్టుబడి పెట్టేందుకు గల మార్గాలను చూడండి.

పీపీఎఫ్
దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలని భావిస్తే మీ మొదటి ఆప్షన్ పీపీఎఫ్. దీనికి 4 కారణాలున్నాయి. మొదటిది దీనికి వడ్డీ పన్ను రహితం. 80సీ కింద పన్ను మినహాయింపులు పొందడం రెండోది. ఇంక మూడో కారణం మీ కోసం పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి వడ్డీ రేటు 8.1 శాతం వస్తూండటం నాలుగో కారణం. చాలా బ్యాంకు డిపాజిట్ల కంటే ఇది ఎక్కువే.

మ్యూచువల్ ఫండ్ సిప్
మ్యూచువల్ ఫండ్ ఖాతా తెరిచి క్రమానుగత పెట్టుబడి ప్లాన్ల(సిప్)ల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఈక్విటీ ఫండ్లను ఎంచుకుంటే 3 నుంచి 5 ఏళ్ల కాలంలోనే ఇవి మంచి రాబడులను ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఎఫ్డీల కంటే దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్లు ఎక్కువ రాబడులను ఇస్తాయి.
బ్యాంకు ఎఫ్డీలకు వడ్డీకి పన్ను పడుతుంది. ఈక్విటీ ఫండ్లకు పన్ను మినహాయింపులు సైతం వర్తిస్తాయి. మీరు సిప్లను రూ. 500 నుంచి ప్రారంభించవచ్చు.

కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు
ఏఏఏ రేటింగ్ కలిగిన కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు మీకు 8.5 నుంచి 9 శాతం వడ్డీ రాబడిని ఇవ్వగలవు. ఇది బ్యాంకు ఎఫ్డీల కంటే కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. బ్యాంకులు ప్రస్తుతం ఎఫ్డీల వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.

గోల్డ్ జువెలర్స్ స్కీమ్స్
బంగారాన్ని ఒక ఉత్తమ పెట్టుబడి మార్గంగా భావించే వారికి బంగారం దుకాణాలు అందించే నెలవారీ గోల్డ్ స్కీమ్స్ సూచనీయం. టైటాన్, జీఆర్టీ, భీమా వంటి సంస్థలు బంగారు స్కీమ్లను ప్రవేశపెడుతున్నాయి. మొదట కొంచెం కొంచెం డబ్బును చెల్లిస్తూ కొంత కాలం తర్వాత బంగారు కొనే వెసులుబాటును ఇవి కల్పిస్తాయి. వేతనం నుంచి కొంచెం డబ్బును ఈ విధంగా పొదుపు చేస్తూ బంగారు కొనేందుకు ఇది దోహదం చేస్తుంది.

చిట్ ఫండ్స్
ఇక్కడ చిట్ ఫండ్స్ గురించి చెబుతున్నారని ఆశ్చర్యపోవద్దు. కొన్ని పేరున్న చిట్ ఫండ్ల గురించి ఎవరికీ అపోహలు ఉండవు. ఉదాహరణకు శ్రీరామ్ చిట్ ఫండ్స్.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో అనుమతి లేని సంస్థలు కూడా చిట్ ఫండ్ల రూపంలో డబ్బును సేకరించి మోసం చేసాయి. అయితే పేరున్న అనుమతి కలిగిన సంస్థలు ఇలా చేయవు. కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్న చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఇవి పిల్లల చదువు, వివాహం, ఇల్లు కట్టుకోవడం, ఇంటి కొనుగోలు వంటి పెద్ద పెద్ద అవసరాలకు క్రమంగా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తాయి. అయితే పేరున్న చిట్ ఫండ్ కంపెనీలవైపే చూడాలని మేము సలహాఇస్తున్నాం.

షేర్లు
మీకు మార్కెట్పై అవగాహన ఉందని భావించి, దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే షేర్లు మరో మార్గం. షేర్లలో పెట్టుబడి అవగాహనతో పెడితే మంచిదే. సెన్సెక్స్ టాప్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే దాదాపుగా నష్టాలు రావు. మీరు సరిగా సమయం కేటాయించలేకపోయినప్పుడు, ఎక్కువ సమయం వెచ్చించలేకపోతే టాప్ కంపెనీలను ఎంచుకుని వాటిలో పెట్టుబడి పెట్టడం సూచనీయం. దీని ద్వారా ఒక చెప్పుకోదగ్గ మొత్తంలో డబ్బు కూడబెట్టడం కాకుండా రెగ్యులర్ డివిడెండ్లను పొందవచ్చు.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు
పోస్టాఫీసు కాలపరిమితి(టైమ్) డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా 7.9 శాతం వడ్డీని పొందవచ్చు. పన్ను మినహాయింపులు లేకపోయినా ఇది భద్రతతో కూడుకున్నది. నెలకు రూ. 200 కనీస పెట్టుబడి నుంచి సైతం ప్రారంభించవచ్చు.

బ్యాంకు డిపాజిట్లు
వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో చివరి ఆప్షన్గా బ్యాంకు డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కాస్త అటుఇటుగా 7.5 శాతం వడ్డీని ఇవ్వజూపుతున్నాయి. అంతే కాకుండా దీనిపై వచ్చే వడ్డీ రూ. 10 వేలకు మించిన సందర్భంలో మూలం వద్ద పన్ను విధిస్తారు.


Click it and Unblock the Notifications