మీ స్మార్ట్ఫోన్ల ద్వారా నగదు బదిలీని మరింత సులభతరం చేయనున్న ఆర్బీఐ
వచ్చే కొన్ని వారాల్లో బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీని స్మార్ట్ఫోన్ల ద్వారా మరింత సులభతరం చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఐడీఆర్బీటీ(ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చి ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అవసరమైతే డిజిటల్ లావాదేవీలు చేసే వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు కల్పించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో మొబైల్ వాడకం పెరుగుతున్న కొద్దీ, యూఎస్ఎస్డీ విధానమైన *99# , యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విధానాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. "స్మార్ట్ఫోన్ విరివిగా అందుబాటులో ఉంటున్నందున యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) పట్ల నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ విధానం ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ సులువు అవుతుంది." అని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.