విజయ్ మాల్యాకు షాక్: అరెస్ట్ చేయాలని ఎస్బీఐ పిటిషన్
ముంబై: భారత్లో వ్యాపారాల పేరిట పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నుంచి వేలాది కోట్ల రూపాయులు రుణం తీసుకుని రుణ ఎగవేతదారుగా ముద్ర పడిన విజయ్ మాల్యాకు షాక్ తగలనుంది. ఆ దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేల్కొంది. ఇటవలే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ను డియోజియోకు విక్రయించిన విజయ్ మాల్యా, ఆ కంపెనీ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేందుకు మాల్యాకు డియాజియో ఏకంగా రూ.515 కోట్లను ముట్టజెప్పిందట.
అంతేకాదు, చైర్మన్గా దిగిపోయిన ఆయనను ఇకపై కంపెనీ ‘చైర్మన్ ఎమెరిటస్'గా కొనసాగించేందుకు ఒప్పుకుంది. తన రాజీనామాపై ‘ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. డియాజియోతో ఉన్న సంబంధం ముగిసింది. తదనుగుణంగానే తక్షణం నా పదవికి రాజీనామా చేస్తున్నాన'ని మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు.

తన భవిష్యత్ కార్యచరణపై మాల్యా మాట్లాడుతూ తనకు 60 ఏళ్లు వచ్చేశాయి. పిల్లలకు దగ్గరగా ఇంగ్లండ్లో మరింత సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో ఇక విజయ్ మాల్యా లండన్ ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యమంటూ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మాల్యా సంస్థలకు భారీ ఎత్తున రుణాలిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేల్కొంది.
తన వద్ద రుణాలు తీసుకుని, వాటిని ఎగవేసి విదేశాలకు పారిపోతున్న మాల్యాను అరెస్ట్ చేయాలని ఎస్బీఐ బ్యాంకు బుధవారం డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది. అలాగే ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని, డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని కోరింది.
ఈ మేరకు బెంగళూరులోని డీఆర్టీకి ఎస్బీఐ నాలుగు పిటిషన్లు సమర్పించినట్లు ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, దాని ప్రమోటరైన మాల్యాకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 7,800 కోట్ల మేర రుణాలను ఇచ్చాయి. వీటిని తీర్చడంలో విఫలమైన మాల్యాను ఇప్పటికే బ్యాంకులు ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్ ఫుల్ డిఫాల్టర్)' గా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications