సబ్సే టెక్నాలజీస్లో రతన్ టాటా పెట్టుబడి
ముంబై: స్టార్టప్ కంపెనీల్లో టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పెట్టుబడుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాకు చెందిన సబ్సే టెక్నాలజీస్లో పెట్టుబడులు పెట్టారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా సబ్సే టెక్నాలజీస్ తన కార్యకలాపాలను సాగిస్తోంది. 'సబ్సేబోలో' బ్రాండుతో క్లౌడ్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను చిన్న-మధ్య తరహా సంస్థలకు అందిస్తోంది. రతన్ టాటా ఎంత పెట్టుబడి పెట్టింది భాటియా వెల్లడించలేదు.
క్లౌడ్ టెలిఫోనీ, వీడియో కాన్ఫరెన్సింగ్, డెస్క్టాప్ షేరింగ్ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ కాల్ కంట్రోల్, స్విచింగ్ ఆఫ్ కాల్స్ విభాగాల్లో పలు పేటెంట్లు కలిగి ఉంది. తమ కంపెనీలో టాటా సన్స్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టారని భాటియా ప్రకటించారు.
గొప్ప దార్శినికుడైన రతన్ టాటా మార్గనిర్దేశకత్వంలో తమ సంస్ధ అగ్రస్థానానికి చేరుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సబ్సే టెక్నాలజీస్ ప్రెసిడెంట్ యోగేశ్ పటేల్ మాట్లాడుతూ వైపై సెల్యూలర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు రతన్ టాటా అనుభవం ఉపయోగపడుతుందన్నారు.