సుబ్రతారాయ్కి ఊరట: నిధుల సేకరణకు సుప్రీం ఓకె
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బెయిల్ కోసం ఇతర దేశాల్లో సేకరించిన 1,050 మిలియన్ డాలర్ల నిధులను అనుమతిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కావాలంటే ముందుగా రూ.10 వేల కోట్ల నిధులు జమ చేయాలని గతంలో సంస్థను కోర్టు ఆదేశించింది.
ఈ విదేశీ లావాదేవీలు జరుపడానికి రిజర్వు బ్యాంక్ అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన రూ.20 వేల కోట్ల నిధులు తిరిగి చెల్లింపులు జరపకపోవడంతో గడిచిన తొమ్మిది నెలలుగా తీహార్ జైల్లోనే సుబ్రతా రాయ్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
65ఏళ్ల రాయ్ బెయిల్ కోసం మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వద్ద రూ.5 వేల కోట్ల నగదు రూపంలో, మిగతా బ్యాంక్ గ్యారెంటీకింద డిపాజిట్ చేయాలని సూచించింది. విదేశాల్లో ఉన్న ఆస్తులను విక్రయించేందుకు తీహార్ జైల్లో ప్రత్యేక వసతులను ఫిబ్రవరి 20 వరకు కల్పించాలని జస్టిస్ టీఎస్ ఠాకుర్ ప్రత్యేక బెంచ్ తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.
కాగా, స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వద్ద రూ.11,500 కోట్ల మేర నిధులు జమచేసినట్లు సహారా పేర్కొంది. బెయిల్కు అవసరమైన నిధులు ఇప్పటికే జమచేయడం జరిగిందని, త్వరలో రాయ్ బయటకు వచ్చే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.