‘మేక్ ఇన్ ఇండియా’తో వృద్ధిరేటు పరుగు: మిస్త్రీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియాతో వృద్ధిరేటు మరింత పరుగులు పెట్టేందుకు దోహదపడుతుందని టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. టాటా గ్రూపు చైర్మన్ హోదాలో ఆయన సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 5.82 లక్షల మంది సిబ్బందికి మిస్త్రీ లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, అలాగే టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2014లో అమెరికా, బ్రిటన్ దేశాల్లో భిన్న ఆర్థిక పరిస్థితులు ఏర్పడటంతో ఇతర దేశాలపై ప్రభావం పడిందన్నారు.
ఇప్పటికే పలు రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న సంస్థ భవిష్యత్తులో ఆర్ అండ్ డీ, కొత్త టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతోపాటు పలు రంగాల్లో పోటీ తీవ్రతరం కావడంతో లాభాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
వచ్చే పదేళ్లలో టాటా గ్రూపు సంస్థల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే తమ సంస్థ లక్ష్యం కూడా అదేనని తెలిపారు.