కొచ్చి: ప్రేమికుల కోసం మొబైల్ యాప్ ఎలోప్ను ఆవిష్కరించినట్లు సియెద్ టెక్నాలజీస్ ప్రకటించింది. కేరళకు చెందిన ఐదుగురు విద్యార్థులు కళాశాలలో చదువుతున్నప్పుడే 2013లో దీని అభివృద్ధి చేశారు. ఈ ఏడాది సియెద్ టెక్నాలజీస్ను ప్రారంభించి, యాప్ను విపణిలోకి విడుదల చేశారు.
ఎలోప్ యాప్ 10శాతం సక్సెస్ రేట్ సాధించిందని తెలిపింది. ఇలాంటి ఉత్పత్తుల్లో ఇది అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ ఆకాశ్ మాథ్యూ తెలిపారు. అతి తక్కువ కాలంలోనే 130 దేశాలకు చెందిన 30వేల మందికి పైగా వినియోగించారని, ఇప్పుడు మొబైల్కు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. సురక్షితంగా, తేలికగా ప్రేమను వ్యక్తం చేసేందుకు, స్నేహాన్ని కాపాడుకోవడంలో ఇబ్బందికర పరిణామాల బారిన పడకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
ఎయిర్టెల్ లాభం మూడు రెట్లు వృద్ధి

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్టెల్ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన రెండవ త్రైమాసికంలో దాదాపు మూడు రెట్లు అధికంగా నికర లాభాన్ని ఆర్జించింది.
నిరుడు రెండో త్రైమాసికంలో 512 కోట్ల రూపాయలుగా ఉన్న సంస్థ నికర లాభం ఈ ఏడాది 170.16 శాతం వృద్ధిచెంది 1,383.2 కోట్లకు చేరుకుందని, మొబైల్ డేటా ఆదాయం గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. నిరుడు రెండో త్రైమాసికంలో రూ. 21,324 కోట్లుగా ఉన్న సంస్థ మొత్తం ఆదాయం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధితో రూ. 22,845 కోట్లకు చేరిందని ఎయిర్టెల్ వివరించింది.
25న భారత్-అమెరికా వాణిజ్య సమావేశం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు భారత్, అమెరికా ఉన్నత స్థాయి వాణిజ్య విధాన వేదిక (టిపిఎఫ్) నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సమావేశం కానుంది. నవంబర్ 25వ తేదీన ఈ సమావేశం జరగవచ్చని భావిస్తున్నారు.
2010 నుంచి టిపిఎఫ్ ఇప్పటివరకూ సమావేశం కాలేదు. అయితే ప్రస్తుతం న్యూఢిల్లీలో మంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు ఉభయ దేశాల అధికారులు రంగం సిద్ధం చేశారని, బహుశా వచ్చే నెల 25వ తేదీన ఈ సమావేశం జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మేధోసంపత్తి హక్కులు, ఉభయ దేశాల మధ్య వాణిజ్య, వాణిజ్యేతర అవరోధాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


Click it and Unblock the Notifications