ఎదురుచూపులు: హైదరాబాద్లో రేపు సత్య నాదెళ్ల
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల ఈ నెల 29(సోమవారం)న భారత్లో పర్యటించనున్నారు. గత ఫిబ్రవరిలో నాదెళ్ల మైక్రోసాప్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన కర్ణాటక మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పట్టా పొందారు.
ఆ తర్వాత అమెరికా వెళ్లిన సత్య నాదెళ్ల 1992 నుంచి మైక్రోసాప్ట్లో పని చేస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాలు సత్య నాదెళ్ల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సమావేశం కానున్నారు.
ఇండియాలో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ సెంటర్ ఒక్క హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 30న ఢిల్లీలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.