వరద బాధితులకు రూ. 20 కోట్లు: రాహుల్ బజాజ్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు ప్రముఖ వాహన తయారీ సంస్ద బజాజ్ ఆటో తన వంతు సహాయం అందించనుంది. ప్రధాని జాతీయ సహాయ నిధికి తన వంతుగా రూ. 20 కోట్ల విరాళం ప్రకటించింది.
భారీ వర్షం, వరదలు కారణంగా అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ వాసులను ఆదుకోవాలని భావించి ఈ సహాయం చేస్తున్న బజాజ్ ఆటో ఛైర్మన్ రాహుల్ బజాజ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వరద బాధితులకు సహాయార్దం ప్రధాని జాతీయ సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా యావత్ దేశాన్ని కోరిన సంగతి తెలిసిందే. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే పునరావాస చర్యల్లోనూ తాము భాగస్వాములవుతామని ఆయన హామీ ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. . ప్రధాని కార్యాలయ సిబ్బంది, అధికారాలు ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. కాశ్మీర్ వరద సహాయ చర్యల నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించారు. జమ్ముకాశ్మీర్ వరదల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రూ.5 కోట్ల వరద సాయం ప్రకటించింది.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించగా, అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రూ. 5 కోట్లు సాయం ప్రకటించారు. ఎలాంటి ఇతర సహాయమైనా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ వరద బాధితుల సహాయార్దం రూ. 5 కోట్లు ప్రకటించగా, మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు, బీహార్ ప్రభుత్వం రూ. 10 కోట్లు ప్రకటించాయి.