మోసం: ‘సత్యం’ రామలింగరాజుపై సెబి ఫిర్యాదు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కేసుకు సంబంధించి, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబి) రెండు వేర్వేరు ఫిర్యాదులు దాఖలు చేసింది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సిఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్లు్యసీ ఆడిటింగ్ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొంది.
నేర విచారణ చట్టంలోని సెక్షన్ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అంతేగాక, సత్యం కంప్యూటర్స్కు ఆడిటింగ్ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెబి ఆరోపించింది.

సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం ప్రభుత్వానికి, పర్యవేక్షణ సంస్థలకు తప్పుడు నివేదికలు సమర్పించి దేశప్రతిష్టను దెబ్బ తీసిందని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. సెబీ స్పెషల్ పిపి బిఎస్ శివప్రసాద్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు తోపాటు 18 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా సమర్పించారు. సెబీ దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజిఎం) ప్రదీప్ రామకృష్ణన్ ఉండగా, సాక్షులుగా సెబి సిజిఎం ఎ.సునీల్కుమార్, జిఎం బి.ముఖర్జీలను పేర్కొన్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్...ఈ ఫిర్యాదులను విచారించే అవకాశం ఉంది. 2009 జనవరి 7న అప్పట్లో సత్యం కంప్యూటర్స చైర్మన్గా ఉన్న రామలింగరాజు తన తప్పిదాలను అంగీకరిస్తూ సెబికి మెయిల్ పంపించారు. షేర్ల విక్రయం ద్వారా రూ.543.93 కోట్ల మేరకు రాజు సోదరులు అనుచిత లబ్ధి పొందారని, షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా రూ.1,258 కోట్లను పొందారని సెబి పేర్కొంది. కాగా, తదనంతర పరిణామాల్లో సత్యం కంపెనీని టెక్ మహీంద్రా స్వాధీనం చేసుకుంది.


Click it and Unblock the Notifications