బాబు ప్లాన్: హైటెక్ సిటీలా విశాఖ, విప్రో, టెక్ ఎం సిద్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువ ఇంజనీర్లు, పట్టభద్రులకు దాదాపు 13వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయట. విశాఖపట్నంలో మూడు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించనుంది. రానున్న మంత్రి మండలి సమావేశంలో ఐటి పరిశ్రమ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐటీలో పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం పారదర్శకత, ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన సదుపాయాల కలపనకు విశాఖ ఐటీ కారిడార్ను పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికారిక సంస్థ కిందకు తీసుకు రానున్నారు. మధురవాడ ఐటీ సెజ్ డీనోటిఫై పైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయట. ఇప్పటి వరకు ఏపీలో విశాఖలో మాత్రమే ఐటీ పరిశ్రమలు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇక్కడ ఐటీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా టెక్ మహీంద్రా సంస్థ 5వేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ సంస్థకు విశాఖ ఐటీ లే అవుట్లో దాదాపు పది ఎకరాలు ఇచ్చే అవకాశముందట. విప్రో సంస్థ తమ వ్యాపార విస్తరణలో భాగంగా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిందట. ఈ రెండు సంస్థలకు అవసరమైన భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం త్వరలో అధికారిక నిర్ణయం తీసుకోనుందట.
ఇవి ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల మందికి పైగా ఉపాధి లభించనుందంటున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, పరిశోధన సొసైటీ పరిశోధన విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి.
విశాఖ ఐటీ జోన్ను ఐలా (పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికారిక సంస్థ)గా ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో హైటెక్ సిటీ, ఆదిభట్లనను ఐలాగా గుర్తించారు. ఐలాగా గుర్తిస్తే ఐటీ పరిశ్రమలకు అవసరమైన రహదారులు, వీధి లైట్లు, మురుగు నీటి పారుదల, పన్నుల వసూలు వ్యవస్థ, లే అవుట్లు వేయడం, మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యత ఏపీఐఐసీ పరిధిలో ఉంటుంది.