బ్రాండ్ హైదరాబాద్: ఐటి అభివృద్ధిపై కొత్త ఆశలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో అనిశ్చితి పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు చేయాల్సిందల్లా తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పునర్నిర్మాణమే. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పేర్కొంటోంది.
నూతన ప్రభుత్వంలో రాష్ట్ర సమాచార, సాంకేతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్లో పరిశ్రమల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. ఐటి దిగ్గజ కంపెనీలు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజంట్, టాటా కన్సల్టెన్సీ సంస్థలు తమ కార్యకలాపాలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో విస్తరించేందుకు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. బహుళ జాతి సంస్థల కార్యకలాపాల విస్తరణ ద్వారా హైదరాబాద్లో సుమారు 40వేల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని చెప్పారు.

తమ ప్రభుత్వం ఐటి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కెటిఆర్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాక్చర్ రీజియన్ (ఐటిఐఆర్) ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15 లక్షల మందికి ప్రత్యక్ష, 35 లక్షల మందికి పరోక్ష ఉద్యోగాలు రాబోయే ఐదేళ్లలో లభిస్తాయని కెటిఆర్ తెలిపారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం కేంద్రం 1.32 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు 2024లో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుతోపాటు స్వల్పకాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇస్తామని కెటిఆర్ చెప్పారు.
ప్రస్తుతం 30వేల మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాగ్నిజెంట్ సంస్థ, తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. హైదరాబాద్ నగర శివారులోని ఆదిభట్లలో 54 ఎకరాల్లో సొంత ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్, యాంటి స్పామ్ సాఫ్ట్వేర్ ప్రొడాక్ట్స్ కార్యకలాపాలను విస్తృతం చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇది 12వేల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం 7,500 మంది ఉద్యోగులతో మాదాపూర్ కార్యాలయం నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తున్న గూగుల్ సంస్థ కూడా తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది.
గూగుల్ సంస్థ కోకాపేటలో 20 ఎకరాల విస్తీర్ణంలో టౌన్షిప్ నిర్మించి కార్యకలాపాలను సాగించాలని యోచిస్తోంది. ఈ వెంచర్ ద్వారా గూగుల్ సంస్థ మరో 5వేల ఉద్యోగాలను సృష్టించనుంది. తమ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న అమెజాన్ సంస్థ.. నానక్రాంగూడలో 2.6 మిలియన్ స్కేర్ ఫీట్లలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోనుంది. ఈ సంస్థ విస్తరించనున్న సాఫ్ట్వేర్ కార్యకలాపాల వల్ల 5వేల ఉద్యోగాలు సృష్టించబడతాయి. గచ్చిబౌలి, మాదాపూర్లలో కార్యాలయాలను కలిగి ఉన్న టిసిఎస్ కూడా ఆదిభట్లలో 70 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకుంది.
ఆదిభట్లలో తమ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది టిసిఎస్. ఇక్కడ ప్రాజెక్టు పూర్తయితే మరో 12వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించేందుకు సుముఖంగా ఉన్నాయి.
కొత్తగా ఐటి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెటిఆర్ ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో పలుమార్లు సమావేశమయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ను పునర్నిర్మాణం చేసేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పారిశ్రామికవేత్తలకు తెలిపారు. 16 పాయింట్లతో ఐటి అభివృద్ధికి ఎజెండా రూపొందిస్తున్నామని, పరిశ్రమలకు ఎదురయ్యే సమస్యలను పరిశీలించేందుకు ఐటి గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే విస్తరించిన ఐటి రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లకు విస్తారించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఈ నగరాల్లో ఐటి కారిడార్ను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ కారిడార్లో పరిశ్రమలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఇన్సెంటివ్స్, టాక్స్ రిబేట్స్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications