తగ్గుతున్న పసిడి ధరలు: పుంజుకున్న రూపాయి

Gold prices fall sharply as RBI allows seven more agencies to import
ముంబై/న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ సడలించిన నేపథ్యంలో దేశంలో పసిడి ధరలు దిగివస్తున్నాయి. సరుకు లేదంటూ, వాస్తవ ధరపై అదనంగా వసూలు చేస్తున్న (ప్రీమియం) మొత్తాన్ని ఆయా సంస్థలు తగ్గించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఒక్కరోజే కిలో బంగారంపై ప్రీమియం రూ. 15,000 మేర తగ్గిందని ప్రముఖ బులియన్ ట్రేడర్ ఒకరు తెలతిపారు.

దీపావళి నాటికి 10 గ్రాముల పుత్తడి ధర 23,000-24,000 స్థాయికి పడిపోతాయని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) అంచనా వేసింది. మరోవైపు గురువారం ఒక్కరోజే న్యూఢిల్లీలో పసిడి ధరలు 9 నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 800 క్షీణించి 28,550 వద్ద స్థిరపడింది. అలాగే 99.5 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర 28,350 వద్ద నిలిచింది. తాజా క్షీణతతో గత ఏడాది ఆగస్టు 8న నమోదైన ధరల సరసన ప్రస్తుత పుత్తడి ధరలు చేరాయి. మందగించిన డిమాండ్, అంతర్జాతీయంగా తగ్గిన ధరలు బంగారం ధరల పతనానికి కారణమయ్యాయి.

ఇంతకాలం స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో మదుపర్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ఉన్న పసిడి.. సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండటంతో మదుపర్లు మళ్లీ తమ పెట్టుబడులను పుత్తడిపై నుంచి స్టాక్స్‌లలోకి తీసుకెళ్తున్నారు. ఇదికూడా బంగారం ధరల పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు దిగజారుతుండగా, న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 0.19 శాతం పడిపోయి 1,291.90 వద్ద ముగిసింది.

పసిడి అధికారిక సరఫరా పెరుగుతోంది: డబ్ల్యుజిసి

భారత రిజర్వు బ్యాంకు బంగారం దిగుమతులకు సంబంధించిన ఆంక్షలను సడలించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) పేర్కొంది. తాజా నిర్ణయంతో మార్కెట్లోకి పసిడి అధికారిక సరఫరా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బంగారం దిగుమతులపై ఆంక్షలున్నందు వల్ల ఇంతకాలం వ్యాపారులు దిగుమతులకు దూరంగా ఉన్నారని, ఇప్పుడు వారంతా మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తారని డబ్ల్యుజిసి మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నెలకు 15 టన్నుల దిగుమతి పెరగొచ్చు : జిజెఎఫ్

ఆర్‌బిఐ తాజా నిర్ణయం నేపథ్యంలో రానున్న కాలంలో మన దేశంలోకి బంగారం దిగుమతి నెలకు 10-15 టన్నులు పెరగవచ్చని అఖిల భారత వజ్రాభరణాల సమాఖ్య (జిజెఎఫ్) డైరెక్టర్ బచ్‌రాజ్ బమల్వా తెలిపారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవుతుండ టానికి తోడుగా ఆర్‌బిఐ పసిడి దిగుమతులపై ఆంక్షలు సడలించడం వల్ల మార్కెట్లో వాతావరణం సానుకూలంగా మారిపోయిందని ఆయన చెప్పారు. ఆర్‌బిఐ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని జిజెఎఫ్ చైర్మన్ హరీష్ సోని తెలిపారు. తాజా నిర్ణయం పరిశ్రమకు ఎంతో సానుకూలమైందని, బంగారం సరఫరా పెరగడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
దూసుకుపోయిన జువెలరీ షేర్లు

బంగారం దిగుమతులపై ఆర్‌బిఐ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో గురువారం జువెలరీ కంపెనీల షేర్ల ధరలు దూసుకుపోయాయి. బిఎస్ఈలో త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ షేరు ధర ఊహించని విధంగా 19.96 శాతం మేర పెరిగి 191.75 రూపాయలకు చేరుకుంది. పిసి జువెలర్ షేరు కూడా 19.59 శాతం ఎగబాకి 123.90 రూపాయల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు 19.98 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేరు 11.93 శాతం వృద్ధితో 102.30 రూపాయల వద్ద ముగియగా.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేరు 11.10 శాతం, టైటాన్ కంపెనీ షేరు 6.55 శాతం, శ్రీ గణేష్ జువెలరీ హౌజ్ షేరు 5 శాతం మేర పెరిగాయి.

మరింత పుంజుకున్న రూపాయి మారకం విలువ

ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మరింతగా పుంజుకుంది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 30 పైసలు పెరిగి 58.47కు చేరింది. గత వారం రోజుల్లో రూపాయి విలువ ఇంతగా ఎన్నడూ పెరగలేదు. ప్రస్తుతం రూపాయి విలువ 11 నెలల గరిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికవరీ బాట పట్టడంతోపాటు ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం మూలంగా రూపాయి విలువ పెరగడానికి అవకాశం ఏర్పడిందని ఫారెక్స్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు సెషన్లలో రూపాయి 18 పైసలు క్షీణించింది. అయితే మూడో రోజున ఒక్కసారిగా 30 పైసలు పెరగడం అశ్చర్యానికి గురి చేస్తోందని ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు.

ఫ్లిప్ కార్డ్ చేతికి మింత్రా

బెంగళూరు: దేశీయ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. మరో ఆన్‌లైన్ వస్త్ర వ్యాపార సంస్థ మింత్రా డిజైన్స్‌ను కొనుగోలు చేసింది. 2,000 కోట్ల రూపాయలతో మింత్రాను ఫ్లిప్‌కార్ట్ దక్కించుకుంది. కాగా, మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముఖేష్ బన్సాల్ ఇరు సంస్థల ఫ్యాషన్ విభాగం అధిపతిగా పనిచేస్తారని, కంపెనీ బోర్డులోనూ ఆయనకు స్థానం ఉంటుందని గురువారం ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. భారత్‌లోని ఈ-కామర్స్ మార్కెట్ అమ్మకాల్లో దాదాపు సగం ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+