న్యూఢిల్లీ: బొగ్గుశాఖలో సంస్కరణల అమలుకు ఆ శాఖ మాజీ మంత్రులు దాసరి నారాయణ రావు, శిబుసోరెన్తో పాటు పలువురు ఎంపీలు అడ్డుపడ్డారని బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ పేర్కొన్నారు. తన అమలు చేయాలనుకున్న సంస్కరణలు అమలై ఉంటే కోల్ గేట్ స్కాం జరిగి ఉండేది కాదని పరేఖ్ తీవ్ర విమర్శలు చేశారు. బొగ్గు కుంభకోణానికి దాసరి నారాయణరావు, శిబూ సోరెన్ లతోపాటు బొగ్గుశాఖ మంత్రులే ప్రధాన కారకులని పేర్కొన్నారు.
బొగ్గు బ్లాకులను బహిరంగ వేలంలో కేటాయించాలన్న తన ప్రతిపాదనను ఈ ఇరువురు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారని, దురదృష్టవశాత్తు ప్రధాని సైతం వీరిని అదుపు చేయలేకపోయారని ఆయన తెలిపారు. చివరికి లంచాలు మెక్కి పిఎస్యు సిఈఓలు, డైరెక్టర్లను నియమించే వారన్నారు. అనేక మంది ఎంపీలు బ్లాక్ మెయిలర్లుగా, దోపిడీదారులుగా మారటం తన కళ్లారా చూసానని, వీరు అధికారులను, ప్రభుత్వ కంపెనీల సిఇఒలను బ్లాక్ మెయిల్ చేసేవారని ఆయన చెప్పారు.
తాను బొగ్గు శాఖ కార్యదర్శిగా ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకునుంటే అది కేవలం ప్రధాని బొగ్గుశాఖ బాధ్యతలు చూసిన సమయంలో మాత్రమే తీసుకున్నానని ఆయన తెలిపారు. తాను బొగ్గు శాఖలో ఉన్నప్పుడు ప్రధాని తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, బొగ్గుశాఖలో సంస్కరణలను సైతం ఆయన సమర్ధించారని, ఆయన పోషించిన పాత్ర వల్లే తాము ఎన్నో పనులు చేయగలిగామని పరేఖ్ తెలిపారు.
బొగ్గుబ్లాకులను ఇంటర్నెట్ ఆధారిత వేలంలో పెట్టాలన్న ప్రధాని నిర్ణయాన్ని మంత్రులే తోసి రాజన్నారని పరాఖ్ తెలిపారు.

"క్రూసేడర్ ఆర్ కాన్సిపిరేటర్? కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్'' పేరుతో రచించిన పుస్తకావిష్కరణ అనంతరం పరేఖ్ మీడియాతో మాట్లాడారు. బొగ్గు బ్లాకులకు బహిరంగ వేలంతో సహా ఇతర సంస్కరణల అమలుకు ప్రధాని తన అధికారాలను ఉపయోగించి చొరవ చూపి ఉంటే అసలు కోల్గేట్ కుంభకోణమే జరిగి ఉండేది కాదని పరాఖ్ ఖ్యానించారు. అదృష్టవశాత్తు ప్రధాని మరోసారి బొగ్గుశాఖ బాధ్యతలు స్వీకరించడంతో ఇ- మార్కెటింగ్ ఆర్డర్ను అమలుచేయగలిగానని ఆయన తెలిపారు.
తాలబిరా-2 గనుల కేటాయింపులో తన పేరును సిబిఐ ఎఫ్ఐఆర్లో దాఖలు చేయడంపై స్పందిస్తూ "బొగ్గు గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సిబిఐ చెబుతోంది. ఏ విధమైన కుట్రా లేదని నేనంటున్నాను. ఒక వేళ కుట్ర జరింగిందని సిబిఐ భావిస్తే నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల మధ్య కుట్ర జరిగి ఉంటుంది'' అని ఆయన అన్నారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రేనని, ఒకవేళ కుట్రలో తాను భాగస్వామినైతే ప్రధాని సైతం భాగస్వామేనని ఆయన అన్నారు. బొగ్గుగనుల కేటాయింపులో పరాఖ్ హిందాల్కోకు సహకరించారని సిబిఐ ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, పరేఖ్ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి.


Click it and Unblock the Notifications