
రాష్ట్ర విభజనతో రాజకీయ అనిశ్చితి తొలిగిపోతుందని దీనివల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఫ్యాప్సీ అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యదేవర పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు పారిశ్రామిక పురోభివృద్ధికి అనుగుణంగా విధానాలను చేపట్టాలని ఆయన సూచించారు. ఆర్థిక రంగం పురోగతి కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వంతోనైనా కలసి పనిచేసేందుకు ఫ్యాప్సీ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న రాష్ట్ర విభజన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించిందని సిఐఐ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్, ఇన్ఫోటెక్ గ్లోబల్ హెచ్ఆర్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. విభజన తర్వాత వనరులు, నిపుణుల లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలకు పరిశ్రమల కేటాయింపు ఉండాలని సూచించారు.
హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత సీమాంధ్ర రాజధానిని ప్రకటించడంలో ఆలస్యం చేయకూడదని, దీంతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని అన్నారు. విద్యుత్, నదీ జలాల పంపిణీ, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, పన్ను రాయితీలు మొదలైన అంశాలపై స్పష్టమైన వైఖరిని కేంద్రం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.


Click it and Unblock the Notifications