మంచికాలం వుంది: ఎన్నారైలకు ప్రధాని భరోసా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఐదు శాతం వృద్ధి సాధిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 12వ ప్రవాసీ భారతీయ దివస్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. మౌలిక వసతుల కల్పనకు, ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఎదుగుతోందని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. గత దశాబ్దకాలంగా భారత ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి పథాన పయనిస్తోందని ఆయన తెలిపారు. 2004 నుంచి ఇప్పటివరకు వార్షికంగా సుమారు 7.9 శాతం చొప్పున ప్రగతి సాధించామని ప్రధాని వెల్లడించారు. గత కొద్ది కాలంగా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైందని, దీని ప్రభావంతో ప్రస్తుత ఏడాది సైతం నిరుడులాగా 5 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చాలా మందిలో అనుమానాలున్నాయని, సామాజిక సవాళ్లు, రాజకీయ వ్యవస్థ, పాలనా విధానాలపై ఆందోళన ఉందని తనకు తెలుసునని చెప్పారు. భారత్ గత వైభవాన్ని కోల్పోతోందని దేశం వెలుపల ఉండే భారతీయులు భావిస్తున్నారని తెలిపారు. అయితే ఈ విషయమై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రవాసులందరూ పూర్తి విశ్వాసంతో, ఆశాభావంతో దేశ ప్రగతిపై దృష్టి సారించాలని మన్మోహన్సింగ్ పిలుపునిచ్చారు. భవిష్యత్లో గ్రామాలకు సైతం బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని ప్రధాని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు అనేక దేశీయ, అంతర్జాతీయ అంశాలే కారణమని ప్రధాని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశ ఆర్థిక పునాదులు చెక్కుచెదరకుండా బలంగానే ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఇప్పటికీ దేశ పొదుపు పెట్టుబడుల రేటు జిడిపిలో 30శాతంపైనే ఉందని, భారత్లో పారిశ్రామిక స్ఫూర్తి రగులుతూనే ఉందని ప్రధాని తెలిపారు.
సహజవనరుల కేటాయింపు, వాడకానికై ప్రస్తుతం ఉన్న విధానాలని హేతుబద్ధీకరించేందుకు, ఎఫ్డిఐ విధానాన్ని సరళీకరించేందుకు, విత్త నిర్వహణను మెరుగుపరిచేందుకు, పన్ను వ్యవస్థను సంస్కరించేందుకు చర్యలు చేపట్టామని ప్రధాని వెల్లడించారు. అదే విధంగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కూడా అనేక చర్యలు చేపడుతున్నట్లు ప్రధాని తెలిపారు. తమ ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పటికే ఫలితాలనిస్తున్నాయని, వచ్చే కొద్ది నెలల్లో దేశ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్య మార్పులు సంభవిస్తాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications