బిల్లులు ఆమోదించాలి: రాజన్, రాజీపడమన్న చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు వ్యయాలు పెరిగి ద్రవ్య లోటు మరింత పెచ్చుమీరుతుందన్న ఆందోళనలను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తోసిపుచ్చారు. బుధవారం ఇక్కడ జరిగిన ఎకనామిక్ కాంక్లేవ్-2013ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్రవ్యస్థిరీకరణపై ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు. గరిష్ట స్థాయిలో కదలాడుతున్న ద్రవ్యోల్బణమే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూపిఏ ఎదురుదెబ్బ తినడానికి కారణమన్నారు.

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ అజెండాలో అగ్రప్రాధాన్యం గల అంశమని, ఇందుకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన స్పష్టం చేశారు. దొంగ నిల్వలను నివారించడంలో రాష్ట్రాలు ప్రదర్శించిన అలసత్వమే తమకు ముప్పుగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని చిదంబరం స్పష్టం చేశారు. 2016-17నాటికి జిడిపిలో 3శాతానికి ద్రవ్యలోటును పరిమితం అయ్యేవరకూ శ్రమిస్తామని చెప్పారు. వర్థమాన ఆర్థిక సంవత్సరంలో విత్తలోటును 4.8 శాతానికి తగ్గించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని, దాన్ని సాధించి తీరగలమని ఆయన విశ్వాసం ప్రకటించారు.

కీలక బిల్లులు ఆమోదించాలి: రాజన్

కీలకమైన ఆర్థిక బిల్లుల ఆమోదాన్ని వాయిదా వేయవద్దని కాంక్లేవ్‌లో పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయ పార్టీలను కోరారు. ఆర్థిక బిల్లులకు ఇప్పుడు ఆమోదం లభించకపోతే 2014లో జరగబోయే సాధారణ ఎన్నికల అనంతరం ఆమోదం కష్టతరమవుతుందన్నారు. కీలకమైన బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే, వాటిని ప్రస్తుత అధికార వర్గాలు అమల్లోకి తీసుకొస్తే, వృద్ధిరేటు, ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే వీలుందని అన్నారు. డీజిల్ ధరల పెంపు మార్కెట్ స్థాయిని పెంచడమేగాక, సబ్సిడీల భారాన్నీ తగ్గించే వీలుందని ఆయన అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 5 శాతం దరిదాపుల్లో నమోదయ్యే వీలుందని రఘురామ్ రాజన్ అంచనా వేశారు. జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 3 శాతాని కంటే తక్కువగానే ఉంటుందన్న రాజన్, అమెరికా ఉద్దీపనల ఉపసంహరణతో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మొండి బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా అప్పులు చెల్లించనివారికి ఇక రుణాలు చాలా భారమవుతాయని రాజన్ హెచ్చరించారు.

ఇందుకు సంబంధించి ఓ స్పష్టమైన విధానంతో వచ్చేవారం ముందుకొస్తామన్నారు. బ్యాంకుల నుంచి పొందిన ఆర్థిక సాయాన్ని తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ చెల్లించకపోవడం సహించరానిదిగా రాజన్ అభివర్ణించారు. ద్రవ్యోల్బణం అదుపుతోపాటు రూపాయి ఒడిదుడుకులకు అడ్డుకట్ట వేసి లిక్విడిటీని పెంపొందించడంపైనే తమ రాబోయే ద్రవ్య విధాన సమీక్ష దృష్టి ఉంటుందని రాజన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+