
ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో మూడు నెలల్లో చెల్లించాలని ఆగస్టు 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆగస్టు 31వ తేదీన తాను ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సహారా ఇండియాకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (సైరెక్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (షిక్) ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనందుకు సెబీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సహారా గ్రూప్ ఖాతాలను నిలిపివేసే అధికారం సెబీకి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
అంతక ముందు నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుండి రూ. 24,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కేసులో సహారా గ్రూప్లోని రెండు కంపెనీలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్ఐఆర్ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్హెచ్ఐసీ)ల టాప్ ఎగ్జిక్యూటివ్ల ఆస్తులతోపాటు, 100 బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్కు చెందిన షేర్లు, ఆస్తులను కూడా వెంటనే జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
జప్తునకు ఆదేశించిన ఆస్తులలో గ్రూప్నకు చెందిన పుణేలోని ఆంబీ వ్యాలీ రిసార్ట్ టౌన్తోసహా ఢిల్లీ, ముంబైలలోగల ఇతర రియల్టీ ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ నెల 6వ తారీఖున సుబ్రోతో రాయ్కు చెందిన సహారా గ్రూపుకి చెందిన రెండు కంపెనీల ఆస్తుల జప్తుకు మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద అయిన సెబీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆర్డర్ను ధిక్కరించినందుకు సహారాకు చెందిన రెండు కంపెనీల ఖాతాలతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కల్పించింది. దీంతో ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లను చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన గ్రూప్ రెండు కంపెనీల అకౌంట్లను స్తంభింపజేసి, ఆస్తులను జప్తు చేసే సంపూర్ణ అధికారాలు సెబీకి లభించాయి.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications