జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గుతాయా, పెరుగుతాయా: 2 కమిటీల నియామకం
జీఎస్టీకి సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. జీఎస్టీ స్లాబ్స్ నుండి మినహాయించవలసిన వస్తువులు, ప్రస్తుత స్లాబ్ రేట్లు, జీఎస్టీ ఎగవేతదారుల మూలాలు, ఐటీ సిస్టమ్స్లో మార్పులు తదితర అంశాలపై ఈ కమిటీలు సమీక్షించి నివేదిక ఇవ్వాలి. సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో రెండు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పాటు అయ్యాయి.
జీఎస్టీ పన్ను నుండి మినహాయించాల్సిన వస్తువులు, స్లాబ్స్ విలీనం వంటి అంశాలపై ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ ప్యానెల్కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వం వహిస్తారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, బీహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ ఇందులో సభ్యులు. ఈ కమిటీ రెండు నెలల కాలంలో నివేదికను సమర్పిస్తుంది.
జీఎస్టీ పద్ధతిలో తీసుకు వచ్చే సంస్కరణలు, పన్ను ఎగవేత మూలాలు, ఆదాయానికి గండి కొడుతున్న అంశాలపై దృష్టి సారించేందుకు 8 మంది మరో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్, ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి టీఎస్ సింగ్ డియో సభ్యులుగా ఉంటారు.
ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు రేట్లు ఉన్నాయి. ఇందులో కనిష్టం 5 శాతం, గరిష్ట రేటు 28 శాతంగా ఉంది. 12 శాతం, 18 శాతం కూడా ఉన్నాయి. లగ్జరీ వస్తువులు, డీమెరిట్, సిన్ గూడ్స్ పైన 28 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ జీఎస్టీ రేట్లను నాలుగు నుండి మూడింటికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా 12 శాతం, 18 శాతాలను కలిపేయాలనే డిమాండ్ ఉంది.