గుడ్ న్యూస్: తక్కువ వడ్డీకే చిన్న కంపెనీలకు రుణాలు!

దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎంఎస్ఎంఈ) తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నిన్నటి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ప్రకటనతో దీనిపై మరింత హామీ లభించినట్లయింది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల ఎంఎస్ఎంఈ లు కుదేలైపోయాయి. వ్యాపారాలు నిలిచిపోయి, రాబడి లేక, రుణాలు చెల్లించలేక చతికిల పడ్డాయి. అయితే ఇండియా లో లాక్ డౌన్ విధించిన దగ్గర నుంచి ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. ఈ దిశగా నిన్న కూడా రేపో రేటును 4% కి కుదించింది. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వెసులుబాటు లభిస్తోంది. అదే సమయంలో రివర్స్ రేపో రేటును కూడా మరింత తక్కువగా 3.35%కి కుదించింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను వీలైనంత అధికంగా ఖాతాదారులకు ఇచ్చి వాటిపై వడ్డీ రాబడిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రధాన బ్యాంకుల ఉన్నతాధికారులతో జరిగిన ఒక సమావేశంలో కూడా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చిన్న సంస్థలకు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

9% లోపే వడ్డీ...

9% లోపే వడ్డీ...

గతంలో ఎంఎస్ఎంఈ లకు మంజూరు చేసే రుణాల పై వడ్డీ రేట్లు అధికంగా ఉండేవి. ప్రభుత్వ రంగ బ్యాంకులైతే కాస్త తక్కువ వడ్డీ రేటు అందించగా... ప్రైవేటు బ్యాంకులు అధిక వడ్డీ రేటును రాబట్టేవి. గతంలో టర్మ్ లోన్ల పై వడ్డీ రేట్లు 12% నుంచి 17% మధ్య ఉండగా... ప్రస్తుతం దేశంలో లిక్విడిటీ పరిస్థితి మెరుగవటంతో బ్యాంకులు 9% వడ్డీకే రుణాలు మంజూరు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీంతో చిన్న సంస్థలకు భారీ ఊరట లభించనుంది. చైనా వంటి దేశాల్లో ఎగుమతులు చేసే చిన్న సంస్థలకు 5-6% వడ్డీకే అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మన దేశంలో అయితే ఎంఎస్ఎంఈ లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు సగటున 14% ఉంటున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లలో ధరల విషయంలో మన కంపెనీలు పోటీ పడటం కష్టంగా ఉండేది. తగ్గింపు వడ్డీ సరిగ్గా అమలు జరిగితే కంపెనీలకు పెద్ద ఊరటేనని చెప్పొచ్చు.

సరళంగా ప్రక్రియ..

సరళంగా ప్రక్రియ..

చిన్న సంస్థలకు రుణాలు మంజూరు చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్. రకరకాల డాకుమెంట్స్, ఐటీ రిటర్న్స్, సెక్యూరిటీ వంటి సమర్పించాల్సి ఉంటుంది. అవన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ చాలా సార్లు బ్యాంకులు ఏవో కుంటి సాకులు చెప్పి రుణాలు మంజూరు చేయకపోయేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చేలా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులను చాలా సులభతరంగా రుణాలు మంజూరు చేయమని కోరుతోంది. డాక్యుమెంటేషన్ నుంచి అనేక అంశాల్లో సరళమైన విధానాలు అమలు చేయాలని కోరుతోంది. ఎలాగూ చిన్న కంపెనీలకు తాజాగా మంజూరు చేసే రుణాలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పూచీకత్తు (సెక్యూరిటీ) ఇస్తుంది కాబట్టి బ్యాంకులకు భవిష్యత్ లో ఆ రుణాలు మొండి బకాయిలు అయినా పెద్ద ఇబ్బంది ఉండదు.

45 లక్షల కంపెనీలకు ప్రయోజనం...

45 లక్షల కంపెనీలకు ప్రయోజనం...

ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం ... దేశంలోని సుమారు 45 లక్షల చిన్న కంపెనీలు కొత్త రుణాలతో లబ్ది పొందనున్నాయి. వీటికి మొత్తంగా రూ 3 లక్షల కోట్ల విలువైన రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలకు 100% సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుండటం విశేషం. అయితే, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం... ఇప్పటికే సుమారు రూ 1 లక్ష కోట్ల విలువైన రుణాలు మంజూరు అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఇచ్చినవా.. లేదా సహజంగానే ఇచ్చే రుణాలా అన్నది తేలాల్సి ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం పటిష్టంగా ఉంటే..దేశ ఆర్థిక రంగం కూడా వీలైనంత త్వరగా కోలుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ రంగానికి కనీసం రూ 5 లక్షల కోట్ల రుణాల అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+