స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు కుప్పకూలింది.. షేర్ల పతనం వెనుక మూడు ప్రధాన కారణాలు ఇవే..
వారాంతాన్ని లాభాలతో ముగించిన భారత స్టాక్ మార్కెట్ కొత్త వారం ప్రారంభంలోనే భారీ ఒత్తిడితో విలవిలలాడింది. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,200 దిగువకు చేరి పెట్టుబడిదారులను వణికించింది. అంతర్జాతీయ పరిణామాలు, పెరిగిన ముడి చమురు ధరలు, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కలిసి మార్కెట్ సెంటిమెంట్ను నేడు తీవ్రంగా దెబ్బతీశాయి. సోమవారం భారత ఈక్విటీ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురై పలు రంగాల షేర్లు భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి.
ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ 707 పాయింట్లు లేదా 0.9 శాతం క్షీణించి 77,444.79 వద్ద ముగియగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కీలకమైన 24,200 స్థాయి దిగువకు జారి 0.8 శాతం నష్టంతో 24,149.90 వద్ద స్థిరపడింది. దేశీయ సూచీల పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల మంట, దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో వ్యక్తమైన నిరాశజనక ప్రదర్శన కారణమయ్యాయని చెప్పవచ్చు.

ఈ పతనంలో మొదటి అంశం పశ్చిమ ఆసియాలో మళ్లీ తీవ్రమైన సైనిక ఘర్షణలు. అక్కడ ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరా అడ్డంకుల భయాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 4 శాతం ఎగబాకి బ్యారెల్కు $91 డాలర్ల పైచిలుకు స్థాయికి చేరింది. జూన్ మధ్యకాలం తర్వాత చమురు ధరలలో ఇదే అత్యధిక స్థాయి కావడం.. దీనివల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి దేశీయ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళనలు పెట్టుబడిదారులను కుదిపేశాయి.
రెండవ కారణం ఆసియా మార్కెట్ వ్యాప్తంగా కనిపించిన బలహీనత. గ్లోబల్ సెంటిమెంట్ దెబ్బతినడంతో జపాన్ నిక్కీ సూచీ అత్యధికంగా 4.03 శాతం, దక్షిణ కొరియా కోస్పి 3.96 శాతం మేర కుప్పకూలాయి. ఈ అంతర్జాతీయ బలహీన సంకేతాలు భారత మార్కెట్ సెంటిమెంట్ను మరింత ప్రతికూలంగా మార్చాయి.
వీటికి తోడు శనివారం జూన్ త్రైమాసిక (Q1) ఫలితాలను వెల్లడించిన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనై మార్కెట్ను కిందకు లాగాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫలితాల్లో నికర వడ్డీ మార్జిన్ (NIM) 12 బేసిస్ పాయింట్లు తగ్గి 3.26 శాతానికి పడిపోవడంతో పాటు స్థూల, నికర నిరర్థక ఆస్తులు (NPA) పెరగడంతో ఆ షేరు 5.1 శాతం పడిపోయి రూ. 777.50 వద్ద ముగిసింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ విషయంలో నికర వడ్డీ మార్జిన్లు 16 బేసిస్ పాయింట్లు తగ్గడం తో ఈ బ్యాంక్ షేరు ఏకంగా 6 శాతం క్షీణించి రూ. 1,249.05 కి చేరింది. ఈ మూడు ప్రధాన అంశాలు కలసి సోమవారం నాటి మార్కెట్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
