పెట్టుబడిదారులకు పండగే పండగ.. మార్కెట్లోకి రూ.15 వేల కోట్ల IPOలు.. టాప్ కంపెనీ IPOs ఏవంటే..
Upcoming IPOs: గత రెండు నెలలుగా భారతదేశ ప్రాథమిక మార్కెట్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉండటం..సరికొత్త లిస్టింగ్లకు ఇన్వెస్టర్ల నుండి లభిస్తున్న బలమైన ఆదరణను గమనిస్తున్న కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ తీసుకురాబోయే ప్రతిష్టాత్మక ఐపీఓ మార్కెట్లో పెట్టుబడిదారుల సందడిని మరింత పెంచనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ జోరుకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. జూలై నెలాఖరు నాటికి మరో ఐదు అగ్ర శ్రేణి కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఐదు కంపెనీలు సమిష్టిగా దాదాపు 15 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ భారీ నిధుల సమీకరణ పరంపర భారత ఈక్విటీ మార్కెట్లపై ఇటు కంపెనీలకు.. అటు పెట్టుబడిదారులకు ఉన్న బలమైన నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ ఐపీఓల రేసులో మైనింగ్, డెయిరీ, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, హెల్త్కేర్ వంటి కీలక రంగాలకు చెందిన కంపెనీలు ఉండటం గమనార్హం. వీటి ద్వారా ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్లకు పెట్టుబడి పెట్టేందుకు మరిన్ని వైవిధ్యభరితమైన అవకాశాలు లభించనున్నాయి. జూన్ నెలలో ఏడు పబ్లిక్ ఇష్యూల ద్వారా విజయవంతంగా 2,718 కోట్ల రూపాయలు సమీకరించగా.. ఆ సానుకూల ఊపు జూలైలో కూడా బలంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాక్ ప్యాకేజింగ్, కుసుమ్గర్, లేజర్ పవర్ & ఇన్ఫ్రా అనే మూడు ఐపీఓలు మార్కెట్లోకి ప్రవేశించాయి. కాగా, ఈ వారంలోనే ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్తో పాటు ఆల్పైన్ టెక్స్వరల్డ్ వంటి భారీ ఇష్యూలు ప్రారంభం కానుండటంతో మార్కెట్ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి.
జూలై నెలాఖరు నాటికి ఐపీఓకు సిద్ధమవుతున్న ఐదు కంపెనీలలో మొదటిదైన కాలిబర్ మైనింగ్ & లాజిస్టిక్స్.. బొగ్గు తవ్వకం సేవల ప్రదాతగా పేరొంది సుమారు 500 నుండి 600 కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించాలని యోచిస్తోంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల విలువైన ఐపీఓతో రానుండగా.. ఏటీ క్యాపిటల్ గ్రూప్ మద్దతు కలిగిన పునరుత్పాదక ఇంధన సంస్థ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ తన మునుపటి లక్ష్యమైన 3 వేల కోట్ల రూపాయల నుండి ఇష్యూ పరిమాణాన్ని 1,800 కోట్ల రూపాయలకు తగ్గించుకుని మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అలాగే సాంకేతిక వస్త్ర యంత్రాల తయారీ రంగంలో ఉన్న లోహియా కార్ప్ దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన ఆఫర్-ఫర్-సేల్ ఐపీఓను ప్రారంభించనుంది. వీటన్నింటికంటే గరిష్టంగా మణిపాల్ హాస్పిటల్స్ నెట్వర్క్ను నిర్వహిస్తున్న హెల్త్కేర్ దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఏకంగా 9,500 కోట్ల రూపాయల అత్యంత భారీ ఐపీఓతో రాబోతోంది.
ఈ ఐదు సంస్థలతో పాటు.. బెంగళూరుకు చెందిన టోన్బో ఇమేజింగ్, మధ్యప్రదేశ్కు చెందిన సింబయోటెక్ ఫార్మాల్యాబ్ కూడా జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించే యోచనలో ఉన్నాయి. అయితే మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వీటి ఇష్యూ పరిమాణం గతంలో అంచనా వేసిన దానికంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రముఖ క్విక్-కామర్స్ స్టార్టప్ జెప్టో కూడా ఐపీఓ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. మునుపటి అంచనాల కంటే గణనీయంగా తగ్గిన వాల్యుయేషన్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే గడిచిన నెలలో జియో ప్లాట్ఫామ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి దిగ్గజ సంస్థలు తమ ముసాయిదా ఐపీఓ పత్రాలను దాఖలు చేయడంతో ప్రైమరీ మార్కెట్ మందగమనం పూర్తిగా ముగిసిపోయింది. మెరుగుపడుతున్న అంతర్జాతీయ సెంటిమెంట్, విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలు ఈ ఐపీఓల విజయానికి మరింత తోడ్పడనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
