ఆకాశం నుండి పాతాళానికి పడిపోయిన టాప్ 20 షేర్లు! కొనేందుకు ఇదే సరైన సమయమా?
భారత స్టాక్ మార్కెట్ (Stock market) లో ఎప్పుడూ లాభాల కథలే వింటూ ఉంటాం. ఫలానా షేరు ఇన్ని రెట్లు పెరిగింది, ఇన్వెస్టర్లకు లక్షల కోట్లు తెచ్చిపెట్టింది అని మాట్లాడుకుంటారు. కానీ మార్కెట్లో వచ్చే కరెక్షన్లు ఎంత ఘోరంగా ఉంటాయో, ఎంతటి పెద్ద కంపెనీలనైనా ఎలా కిందకు లాగుతాయో ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయి, ఇన్వెస్టర్లకు ఫేవరెట్గా మారిన దాదాపు 20 ప్రముఖ స్టాక్స్.. వాటి జీవితకాల గరిష్టాల (Lifetime Highs) నుండి ఏకంగా 50% నుండి 62% వరకు ఘోరంగా పడిపోయాయి. ఇందులో ప్రభుత్వ రంగ (PSU) సంస్థలు, రైల్వే స్టాక్స్, ఐటీ దిగ్గజాలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉండటం విశేషం.

భారీగా నష్టపోయిన టాప్ కంపెనీలు ఇవే!
ఈ పతనంలో అందరికంటే ముందు వరుసలో ఉంది ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX). ఈ షేరు తన లైఫ్ టైమ్ హై నుండి ఏకంగా 62% పడిపోయింది. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగానికి ఫైనాన్స్ చేసే ప్రభుత్వ రంగ సంస్థ IREDA కూడా ఇన్వెస్టర్లలో ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ 61% క్రాష్ అయ్యింది. ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కైన్స్ టెక్నాలజీ సైతం 61% నష్టపోయింది.
ఆటోమొబైల్ సాఫ్ట్వేర్ రంగంలో దూసుకెళ్లిన కేపీఐటీ టెక్నాలజీస్ (KPIT) 60% విలువను కోల్పోగా, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) కూడా తన పీక్ స్టేజ్ నుండి 60% పతనమైంది. టాటా గ్రూప్నకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టాటా ఎల్క్సీ కూడా 60% మేర కరెక్ట్ అయ్యింది.
రైల్వే, డిఫెన్స్, ఐటీ షేర్ల పరిస్థితి ఏంటి?
ఒకప్పుడు మార్కెట్ను పరుగులు పెట్టించిన రైల్వే స్టాక్స్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) తన ఆల్-టైమ్ హై నుండి 58% కిందకు పడిపోయింది. అలాగే రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ (RITES) 50% నష్టపోయింది. డిఫెన్స్ , షిప్బిల్డింగ్ రంగంలో సంచలనాలు సృష్టించిన కొచ్చిన్ షిప్యార్డ్ (Cochin Shipyard) 52% మేర క్రాష్ అయ్యింది.
ఐటీ రంగపు దిగ్గజం, దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా ఈ దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయింది. టీసీఎస్ షేరు తన గరిష్ట స్థాయి నుండి 53% పడిపోవడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది.
మిగిలిన ప్రముఖ స్టాక్స్ లిస్ట్..
- బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్: -56%
- కళ్యాణ్ జ్యువెలర్స్, జుబిలెంట్ ఫుడ్వర్క్స్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్: -55%
- డీఎల్ఎఫ్ (రియల్ ఎస్టేట్ దిగ్గజం), ఏసీసీ సిమెంట్, అమర రాజా ఎనర్జీ: -53%
- ట్రెంట్ (టాటా రిటైల్), ఎస్బీఐ కార్డ్స్: -50%
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
మార్కెట్ సెంటిమెంట్ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఈ భారీ పతనమే ఒక ఉదాహరణ. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలమైన ఫండమెంటల్స్ ఉన్న మంచి కంపెనీల షేర్లు ఇలా 50% పైగా డిస్కౌంట్లో దొరకడం అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు (Long-term Investors) ఒక మంచి అవకాశంగా మారవచ్చు. కానీ, కేవలం తక్కువ ధరకే వస్తున్నాయని బ్లైండ్గా కొనకుండా, కంపెనీల త్రైమాసిక ఫలితాలు , భవిష్యత్ వృద్ధిని చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications