ఈ స్టాక్ షేర్ మార్కెట్లో దుమ్మురేపింది.. ఏకంగా రూ. కంపెనీని రూ. 80 వేల కోట్లకు తీసుకెళ్లింది..
దివంగత ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్ఝున్వాలాకు బిగ్ బుల్ గా అపారమైన గుర్తింపు తెచ్చిపెట్టిన టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ టైటాన్ కంపెనీ (Titan Company)షేర్లు స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించాయి. దాదాపు రెండేళ్ల పాటు పెద్దగా రాబడులు ఇవ్వక నిరాశపరిచిన ఈ స్టాక్.. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరచడంతో పాటు ఈ ఏడాదిలోనే ఏకంగా రూ. 80 వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ను అదనంగా సంతరించుకుని మళ్లీ ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్గా మారింది.
గత సెషన్లో బిఎస్ఈ (BSE) లో రూ. 4,943 వద్ద ముగిసిన ఈ షేరు, ఈరోజు రూ. 4,977.20 వద్ద ప్రారంభమైంది. ఇంట్రా-డే ట్రేడింగ్లో ఏకంగా 3 శాతానికి పైగా పుంజుకుని రూ.5,121.30 వద్ద ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని (All-Time High) తాకింది. ఉదయం 11:30 గంటల సమయానికి 2.31 శాతం లాభంతో రూ. 5,057 వద్ద ట్రేడవుతుండగా, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 4.50 లక్షల కోట్ల మైలురాయికి చేరువైంది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.5 లక్షల కోట్ల మైలురాయిని సునాయాసంగా దాటేసింది.

గడిచిన రెండేళ్లలో అధిక వ్యయాలు, బంగారం ధరల తీవ్రమైన హెచ్చుతగ్గులు, వినియోగదారుల డిమాండ్పై ఉన్న సందేహాల వల్ల ఈ స్టాక్ పరుగు మందగించింది. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణ, నగర ప్రాంతాలలో వినియోగదారులు అసంఘటిత (Local) ఆభరణాల దుకాణాల నుంచి తనిష్క్ (Tanishq), క్యారట్లేన్ (CaratLane) వంటి విశ్వసనీయ బ్రాండెడ్ శ్రేణుల వైపు వేగంగా మళ్లుతున్నారు. దీనికి తోడు జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉండటం.. పాత ఆభరణాలను మార్చుకునే టైటాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకోవడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి.
కంపెనీ ఇటీవల ప్రకటించిన జూన్ త్రైమాసిక (Q1) ఫలితాలు ఈ ర్యాలీకి మరింత ఇంధనాన్ని అందించాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే టైటాన్ నికర లాభం 63 శాతం పెరిగి రూ. 1,777 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం ఆదాయం కూడా 40 శాతం పెరిగి రూ. 20,753 కోట్లుగా నమోదైంది. బులియన్ అమ్మకాలను మినహాయించి చూసినా, ఒక్క ఆభరణాల పోర్ట్ఫోలియో నుంచే ఆదాయం 43 శాతం పెరిగి రూ. 18,253 కోట్లకు చేరడం కంపెనీ బలమైన పునాదులకు అద్దం పడుతోంది. ఈ బలమైన ఫలితాల నేపథ్యంలో ప్రముఖ విదేశీ, దేశీయ బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్పై తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
హెచ్ఎస్బిసి (HSBC) ఈ స్టాక్కు రూ. 5,290 టార్గెట్ ధరను ఖరారు చేయగా.. సిటీ (Citi) తన 'బై' రేటింగ్ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ. 5,075 నుంచి రూ. 5,700కు పెంచింది. మోతీలాల్ ఓస్వాల్ మరింత సానుకూలంగా స్పందిస్తూ రూ. 6,000 టార్గెట్ ధరతో 'బై' కాల్ ఇచ్చింది. రా మెటీరియల్ సోర్సింగ్, స్టడెడ్ జ్యువెలరీ విభాగంలో పోటీతత్వం, యువ వినియోగదారులను ఆకట్టుకునే రీ-ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల వల్ల టైటాన్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
స్టాక్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పటికే ఈ షేర్లను కలిగి ఉన్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ప్రశాంతంగా హోల్డ్ చేయడం శ్రేయస్కరం. అయితే, రికార్డు గరిష్ఠ స్థాయిల వద్ద రూ. 5,057 ధర వద్ద ట్రేడవుతున్న ఈ స్టాక్లో కొత్తగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం కొంత ప్రమాదకరం కావచ్చు. కొత్తగా ప్రవేశించాలనుకునే ఇన్వెస్టర్లు మార్కెట్లో ఏదైనా సవరణ (Correction) వచ్చి, ధర స్వల్పంగా తగ్గినప్పుడు విడతల వారీగా కొనుగోలు చేయడం అత్యంత ఉత్తమమైన వ్యూహమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
