టీసీఎస్ క్యూ1 ఫలితాలు.. రూ. 13,300 కోట్లు దాటిన లాభాలు.. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ. 12 డివిడెండ్ ప్రకటన..
దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (Q1FY27) సంబంధించిన తన ఆర్థిక ఫలితాలను గురువారం అధికారికంగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 12,760 కోట్ల లాభంతో పోలిస్తే.. కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ. 13,349 కోట్లకు చేరింది.
అయితే, గత త్రైమాసికంలోని (Q4FY26) రూ. 13,718 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం నికర లాభం త్రైమాసిక ప్రాతిపదికన 2.7 శాతం తగ్గింది. ఒక చట్టపరమైన క్లెయిమ్ పరిష్కారం కారణంగా కంపెనీకి ఈ త్రైమాసికంలో రూ. 668 కోట్ల నష్టం వాటిల్లడం కూడా ఈ లాభాల తగ్గుదలకు ప్రధాన కారణమైంది.
మరోవైపు కంపెనీ ఆదాయం మాత్రం అంచనాలను మించి వృద్ధిని కనబరిచింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి రూ.72,275 కోట్లకు చేరింది. గత త్రైమాసికం (Q4)తో పోలిస్తే రూపాయిల పరంగా 2.2 శాతం, స్థిర కరెన్సీ (CC) పరంగా 0.4 శాతం వృద్ధి నమోదైంది. డాలర్ల రూపంలో చూస్తే.. కంపెనీ ఆదాయం $7,624 మిలియన్లుగా నమోదైంది. ఇది కూడా మార్కెట్ అంచనా వేసిన $7,611 మిలియన్ల కంటే మెరుగ్గా ఉంది.

స్థిర కరెన్సీ (CC) పరంగా ఆదాయ వృద్ధి 0.4 శాతంగా నమోదై.. విశ్లేషకులు అంచనా వేసిన 0.15 శాతాన్ని అధిగమించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 24 శాతంగా, నికర మార్జిన్ 19.2%గా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన నికర నగదు రూ. 12,412 కోట్లుగా ఉంది. ఇది కంపెనీ నికర ఆదాయంలో 93 శాతంగా ఉంది.
కంపెనీ నిర్వహణ లాభాల (EBIT) విషయానికి వస్తే.. గత త్రైమాసికంలోని రూ. 17,870 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఇవి 3 శాతం తగ్గి రూ. 17,317 కోట్లకు చేరాయి. అయినప్పటికీ, ఇది మార్కెట్ అంచనా అయిన రూ. 17,348 కోట్లకు చాలా దగ్గరగా ఉంది. అదేవిధంగా వేతనాల పెంపుదల వంటి త్రైమాసిక ప్రభావాల వల్ల కంపెనీ EBIT మార్జిన్ గత త్రైమాసికంలోని 25.3 శాతం నుండి 24 శాతానికి తగ్గింది.
ఇది విశ్లేషకులు భావించిన 24.15 శాతం కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది. ఈ ఆర్థిక ఫలితాలతో పాటు, టీసీఎస్ బోర్డు తన వాటాదారులకు తీపి కబురు అందిస్తూ ఒక్కో షేరుకు రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్కు అర్హులైన వాటాదారులను నిర్ధారించే రికార్డ్ తేదీని 2026 జూలై 15గా నిర్ణయించారు. ఈ డివిడెండ్ను అర్హులైన పెట్టుబడిదారులకు 2026 జూలై 31లోగా చెల్లిస్తారు.
కాగా ఈ త్రైమాసికంలో టీసీఎస్ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకుంది. వాటిల్లో దిగ్గజ సంస్థ SKFతో 800 మిలియన్ డాలర్ల భారీ AI-ఆధారిత పరివర్తన ఒప్పందంతో పాటుగా సర్వీస్నౌతో కోట్లాది డాలర్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. దీంతో పాటుగా యూరప్లోని ఫార్చ్యూన్ గ్లోబల్ 50 కంపెనీతో ఒక ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే కంపెనీ ఏఐ వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మొదటి త్రైమాసికంలో టీసీఎస్ వార్షిక ఏఐ ఆదాయం 2.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 13.6 శాతం పెరుగుదల. ఐటీ కార్యకలాపాలు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్, సాస్ ఇంప్లిమెంటేషన్స్ వంటి రంగాలలో కంపెనీ అనేక ఏఐ కాంట్రాక్టులను దక్కించుకుంది.


Click it and Unblock the Notifications
