సుభాష్ చంద్రకు ఎన్సిఎఎల్టి షాక్.. రూ. 6.25 కోట్ల సెటిల్మెంట్పై స్టే..కారణం ఏంటంటే..
ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం నుండి షాక్ తగిలింది. అంగీకరించిన రూ. 22,006.57 కోట్ల క్లెయిమ్లకు గాను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించి తన వ్యక్తిగత దివాలా ప్రక్రియలను ముగించుకోవడానికి NCLT ఏకసభ్య ధర్మాసనం ఆగస్టు 25న ఇచ్చిన తీర్పు అమలుపై ట్రిబ్యునల్ స్టే విధించింది. అంతేకాకుండా చంద్ర తన ఆస్తులను (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విక్రయించడం.. బదిలీ చేయడం లేదా అన్యాక్రాంతం చేయకూడదని ఆదేశించింది.
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పిటిషన్ను అనుసరించి 2024లో సుభాష్ చంద్రపై వ్యక్తిగత దివాలా ప్రక్రియలు (Personal Insolvency Proceedings) ప్రారంభమయ్యాయి. ఎస్సెల్ గ్రూప్ అనుబంధ సంస్థలు తీసుకున్న భారీ రుణాలకు చంద్ర వ్యక్తిగత హామీదారుగా (Personal Guarantor) సంతకం చేశారు. ఈ కేసులో ప్రధాన వివాదాస్పద అంశాలను పరిశీలించినట్లయితే.. చంద్ర సంతకం చేసిన రూ. 22,000 కోట్ల హామీలకుగాను రుణదాతలకు కేవలం రూ. 6.25 కోట్లు (చెల్లించాల్సిన మొత్తంలో నామమాత్రపు శాతం) చెల్లించేలా మునుపటి ట్రిబ్యునల్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఆమోదించింది. ఈ రికవరీ మొత్తం అసాధారణంగా తక్కువగా ఉండటంతో బ్యాంకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

2017, 2018 లలో సమర్పించిన నికర విలువ ధృవీకరణ పత్రాల (Net worth certificates) ప్రకారం సుభాష్ చంద్ర ఆస్తుల విలువ వరుసగా రూ. 45,888 కోట్లు మరియు రూ. 40,562 కోట్లుగా ఉంది. అయితే, దివాలా ప్రక్రియ సమయంలో ఆయన చూపించిన ప్రస్తుత ఆస్తుల విలువ కేవలం రూ. 31.79 కోట్లు మాత్రమే కావడం రుణదాతలను ఆశ్చర్యపరిచింది. ఈ తిరిగి చెల్లింపు ప్రణాళికకు 80.814% ఓటింగ్ లభించగా, బ్యాంకులు 19.186% ఓట్లతో వ్యతిరేకించాయి. అయితే, ప్రణాళికకు మద్దతుగా పోలైన ఓట్లలో 61.78% ఓట్లు చంద్రకు చెందిన అనుబంధ సంస్థల నుంచే వచ్చాయని బ్యాంకులు ఆరోపించాయి.
మునుపటి రెండు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన చీలిక తీర్పు మరియు తదనంతర ఉత్తర్వులలో స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం లేకపోవడంతో, NCLAT ప్రెసిడెంట్ జస్టిస్ (రిటైర్డ్) అనుపిందర్ సింగ్ గ్రెవాల్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం కేసును మళ్లీ మొదటి నుండి విచారించాలని నిశ్చయించింది. గతంలో చంద్రకు లభించిన వెసులుబాటు నిలిచిపోవడంతో పాటు, ఆయన ఆర్థిక స్థితిపై, గతంలో ఉన్న ఆస్తులు ఏమయ్యాయనే దానిపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరపాలన్న నిబంధన మళ్లీ తెరపైకి వచ్చింది. భారత దివాలా మరియు బ్యాంక్రప్సీ కోడ్ (IBC) కింద వ్యక్తిగత హామీదారుల బాధ్యత, రుణదాతల రికవరీ హక్కులపై రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు అత్యంత కీలకమైన మైలురాయిగా మారనుంది.


Click it and Unblock the Notifications
