చమురు మంటల్లో తగలబడుతున్న స్టాక్ మార్కెట్.. నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ..
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ప్రతిష్టంభనలు, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణపై అనిశ్చితి కొనసాగుతుండటంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా బుధవారం ఉదయం బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాలతోనే తమ ట్రేడింగ్ను సాగించాయి.
ప్రారంభ ట్రేడింగ్లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 35.99 పాయింట్లు క్షీణించి 78,097.31 పాయింట్ల వద్ద కదలాడగా.. ఒకానొక దశలో ఏకంగా 211.37 పాయింట్లు పడిపోయి 77,953.66 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 65.10 పాయింట్లు నష్టపోయి 24,411.15 వద్ద ఒత్తిడిని ఎదుర్కొంది. రాయిటర్స్ నివేదికల ప్రకారం ప్రధాన 16 పరిశ్రమల రంగాలలో 11 రంగాలు క్షీణతను నమోదు చేయగా.. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా ప్రతికూల పరిధిలోనే కొనసాగాయి.

గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు తిరిగి 90 డాలర్లకు చేరువ కావడం భారత మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పనామా జెండా కలిగిన కంటైనర్ నౌకపై అమెరికా సైన్యం దాడి చేయడంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ మళ్లీ 89-90 డాలర్లు దాటడం దలాల్ స్ట్రీట్ ర్యాలీకి ప్రధాన అడ్డంకిగా మారిందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు. చమురు దిగుమతుల బిల్లు పెరగడం వల్ల దేశీయ ద్రవ్యోల్బణం, కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు అమెరికా - భారత్ల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (CPI) గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేరు. దీంతో మంగళవారం రాత్రి వాల్ స్ట్రీట్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఎస్&పి 500, డౌ జోన్స్ 0.3 శాతానికి పైగా నష్టపోగా.. నాస్డాక్ కాంపోజిట్ 0.6 శాతం క్షీణించింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి సూచీ 4.59 శాతం భారీ లాభాన్ని నమోదు చేయగా, జపాన్ నిక్కీ, షాంఘై సూచీలు స్వల్ప లాభాలతోను, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతోను ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో భారతీ ఎయిర్టెల్, మహీంద్రా & మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. కార్పొరేట్ వర్గాల్లో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్స్యూమర్ సీఈఓ సుధీర్ సీతాపతి హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఆ కంపెనీ షేరు భారీగా పతనమై ఇన్వెస్టర్లలో ఆందోళన నింపింది.
కాగా ఎక్స్ఛేంజ్ వివరాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మంగళవారం రూ. 258.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, విఐపి ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసిక ఫలితాలతో పాటు బెహారీ లాల్ ఇంజనీరింగ్, షిప్రాకెట్ ఐపిఓలు నేడు ప్రారంభం కావడం వల్ల ప్రైమరీ మార్కెట్లో సందడి నెలకొంది.


Click it and Unblock the Notifications
